ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 19వ తేదీ (రేపు) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల హాల్టికెట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వేలాది మంది విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఒకేసారి
ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 19 నుంచి 24 వరకు జరుగుతాయి. ఇది రెగ్యులర్ విద్యార్థులతో పాటు, చదువు మధ్యలో ఆపిన వారికీ తిరిగి అవకాశమిచ్చే విధంగా ఉండటం విశేషం. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ విద్యార్ధులందరూ పరీక్షలు బాగారాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరా నిఘాలో ఉంచారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చరవాణులకు పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు.
హాల్టికెట్లు ఇలా పొందొచ్చు
విద్యార్థులు తమ హాల్టికెట్లను క్రింది మార్గాల్లో పొందొచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సప్ 95523 00009 నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాఠశాలల ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్ నుండి పొందవచ్చు. ఓపెన్ స్కూల్ విద్యార్థులు తమ పేరుతో నమోదు చేసుకుని తమ హాల్టికెట్లను పొందవచ్చు.
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల 2025 పూర్తి టైం టేబుల్ ఇదే..
మే 19వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
మే 20వ తేదీన సెకండ్ ల్యాంగ్వేజ్
మే 21వ తేదీన ఇంగ్లీష్
మే 22వ తేదీన గణితం
మే 23వ తేదీన భౌతిక శాస్త్రం
మే 24వ తేదీన జీవ శాస్త్రం
మే 26వ తేదీన సామాజిక అధ్యయనాలు
మే 27వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ I
మే 28వ తేదీన OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2, SSC ఒకేషనల్ కోర్సు
పరీక్ష సమయం
సప్లిమెంటరీ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరాలని సూచించబడింది.
2025 రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫలితాలను వెల్లడించారు. వీటి ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. విద్యార్ధుల నుంచి మొత్తం 66,421 జవాబుపత్రాల దరఖాస్తులు రాగా ఇందులో 47,484 జవాబుపత్రాల ఫలితాలను విడుదల చేశామని అన్నారు.
Read also: Kodali Nani: మెరుగైన చికిత్స కోసం అమెరికాకు కొడాలి నాని?