వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి (MLA Somi Reddy) చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటే ఇచ్చేది కాదు, ప్రజలు ఓట్లతో తీర్పు ఇస్తారు” అంటూ ఆయన వైసీపీని ఎండగట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన ప్రత్యక్ష ప్రతిస్పందన ఇచ్చారు.మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, గతంలో అన్ని శాఖలకు మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం మొరపెట్టుకోవడం హాస్యాస్పదం. ప్రజలు తిరస్కరించిన తర్వాత పదేపదే అడగడం సిగ్గుచేటు అని విమర్శించారు.జగన్ (Jagan) నియంతృత్వ ధోరణిని ఎత్తిచూపిన సోమిరెడ్డి, పులివెందులలో జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేని నాయకుడు ప్రజలకు ఎంట్రీ పాస్లు పెట్టి కలుస్తున్నాడు. సొంత ప్రజలతో కలవలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తాడు? అని ప్రశ్నించారు.
వైసీపీ పాలనపై దుమారం
వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని సోమిరెడ్డి ఆరోపించారు. ఆ దరిద్రపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారు. మేం ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లడానికి భయపడము అని అన్నారు.తమ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలను వివరిస్తూ వైసీపీపై దాడి చేశారు. “మీరు అమ్మఒడి కింద ఒక బిడ్డకే సాయం చేస్తే, మేం తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఉన్న అన్ని పిల్లలకు లబ్ధి అందిస్తున్నాం. మీరు రైతుభరోసా కింద 7,500 రూపాయలు ఇస్తే, మేం అన్నదాత సుఖీభవ పథకంలో 13,500 రూపాయలు ఇస్తున్నాం” అని వివరించారు. అలాగే ‘స్త్రీశక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం’ ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం అని తెలిపారు.
చంద్రబాబుపై వెన్నుపోటు ఆరోపణలపై స్పందన
వైసీపీ నేతలు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు. పార్టీని ఒక మహిళ నుంచి కాపాడటానికి ప్రజాస్వామ్యపద్ధతిలోనే ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నాం. అది వెన్నుపోటు అయితే ప్రజలు ఇన్నేళ్లుగా ఆయన్ని ఆదరిస్తారా? సొంత చిన్నాన్నను హత్య చేసి ఆ నేరాన్ని మాపై వేసుకుని అధికారంలోకి వచ్చిన మీరు మా నాయకుడిపై మాట్లాడటమే హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.
ప్రజల తీర్పు స్పష్టం చేశారని వ్యాఖ్య
వాస్తవాలు గ్రహించిన ప్రజలే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు నిజం అర్థం చేసుకున్నారనేందుకే వైసీపీని త్రోసిపారేశారు. ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించి, కొంతైనా బుద్ధితో మాట్లాడండి అని వైసీపీ నేతలకు హితవు పలికారు.ప్రతిపక్ష హోదా అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల తీర్పే నిజమైన హోదా ఇస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీపై తీవ్ర విమర్శలతో నిండాయి. రాబోయే రోజుల్లో ఈ వాగ్వాదం మరింత వేడెక్కే అవకాశం ఉంది.
Read Also :