ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత చర్చనీయాంశమైన ‘స్కిల్ డెవలప్మెంట్ కేసు’కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ (ACB) కోర్టు, నిన్న కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును పూర్తిగా మూసివేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఐడీ (CID) దాఖలు చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ కేసులో ఎటువంటి అక్రమాలు జరగలేదని ధృవీకరిస్తూ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కీలక కేసులో చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన ఊరట లభించింది.
KTR Warning : జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే – కేటీఆర్
ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ (Mistake of Fact) గా పరిగణిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంటే, ప్రాథమికంగా ఈ కేసు నమోదులో వాస్తవాలను తప్పుగా అంచనా వేయడం లేదా సరైన ఆధారాలు లేకపోవడం వల్ల నిందితులకు ఎటువంటి క్రిమినల్ ఉద్దేశాలు అపాదించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో సుమారు 52 రోజుల పాటు జైలులో ఉండటానికి కారణమైన ఈ కేసు, ఇప్పుడు వీగిపోవడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. నిందితులందరికీ ఈ కేసు నుండి విముక్తి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిజం గెలిచిందని వారు పేర్కొంటున్నారు.
అయితే, ఈ తీర్పు వెలువడకముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కె. అజయ్ రెడ్డి, ఈ కేసులో తన వాదనలను కూడా వినాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఏసీబీ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. సీఐడీ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్ సంతృప్తికరంగా ఉందని భావించిన న్యాయస్థానం, ఇక ఎటువంటి అదనపు వాదనలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ వివాదానికి ముగింపు పడినట్లయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని కోర్టు తీర్పు ద్వారా స్పష్టమవ్వడంతో ప్రభుత్వం తదుపరి అభివృద్ధి పనులపై దృష్టి సారించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com