ఆంధ్రప్రదేశ్లో మిర్చి ధరలు భారీగా తగ్గడం రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. గత సీజన్లో క్వింటాల్ రూ.21,000 వరకు ఉన్న మిర్చి ధర ఇప్పడు రూ.13,000 వరకు పడిపోవడం కలవరం రేపుతోంది. డిమాండ్ తగ్గడంతో కొనుగోలు తగ్గిపోయిందని, మద్దతు ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు నష్టపోకుండా వారికి రక్షణ కల్పించేందుకు ఏపీలో ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (RRR) కేంద్రాన్ని కోరారు.

మిర్చి బోర్డు అవసరమేంటీ?
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద మిర్చి ఉత్పత్తిదారులలో ఒకటి. గుంటూరు మిర్చి మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుపొందింది. అయితే, మిర్చి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటంతో రైతులకు స్థిరమైన ఆదాయం అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు సరైన మద్దతు ధర, ప్రణాళికాబద్ధమైన మార్కెటింగ్, ఎగుమతుల విధానాలు లభించనున్నాయి. ఇతర పంటలకు ఉన్న బోర్డుల మాదిరిగా మిర్చికి కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తే, రైతులకు మేలు జరుగుతుందని RRR అభిప్రాయపడ్డారు.
రైతుల భవిష్యత్ & ప్రభుత్వ చర్యలు
ఈ సమస్యపై రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మిర్చి బోర్డు ఏర్పాటు అవసరమని RRR స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మిర్చి రైతులకు ఆర్థిక సాయం, న్యాయమైన మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.