Reservoirs : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 100 టీఎంసీల నీరు నిల్వ ఉండడం నెల్లూరు జిల్లా (Nellore District) సాగునీటి రంగంలో ఒక నూతన అధ్యాయమని రాష్ట్ర మంత్రి దేవాదాయశాఖ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన జలాశయాలైన సోమశిల, కండలేరు జలాశయాల్లో సుమారు 90 నుంచి 100 టీఎంసీల సమృద్ది నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. రైతాంగానికి ప్రజలకు శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో చేపట్టిన సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ వలన నేడు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి వివరించారు. దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు సత్యవేడు, శ్రీకాళహస్తిని కలుపుకొని మొదటి పంటకు దాదాపు ఆరు లక్షల ఎకరాలకు (Six lakh Acres) నీళ్లిచ్చినట్లు చెప్పారు. సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుల్లో మొదటి పంట తరువాత కూడా రెండవ పంటకు నీళ్లు అందించినా ఇంకా మిగులు నీళ్లు ఉన్నాయన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు శ్రీకాళహస్తి కలిపి రెండో పంటకు ఐదు లక్షల 24 వేల ఎకరాలకు ఒక్క నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇచ్చినట్లు చెప్పారు. రెండో పంట చివరి దశకు వచ్చిందన్న మంత్రి, మరో 20 రోజుల్లో వరి కోతలు మొదలవుతున్నాయని చెప్పారు. సోమశిల జలాశయంలో 59 టీఎంసీలు, కండలేరు, తెలుగు గంగలో 35 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్లు చెప్పారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా, ప్రతి వంటకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రైతన్నలు కూడా ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకోవాలి గాని అనవసరంగా వృధా చేయకూడదని మంత్రి విజప్తి చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :