Nellore Mahila Jana Sunwayi: మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ(Rayapati Sailaja) హెచ్చరించారు.సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన సున్వాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మహిళా కమిషన్ ఎదుట విన్నవించి అర్జీలు సమర్పించారు.పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో మహిళల సమస్యలను చైర్పర్సన్ రాయపాటి శైలజ క్షుణ్ణంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును వేగంగా విచారించి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
Read Also: Lokesh : నారా లోకేష్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాయపాటి శైలజ, జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా జన సున్వాయి(Nellore Mahila Jana Sunwayi) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో మొదటిసారిగా నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళల సమస్యలను నేరుగా తెలుసుకున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి చాలా మంది మహిళలు తమ సమస్యలతో రావడం కష్టసాధ్యమవుతుందని పేర్కొన్న ఆమె, అలాంటి మహిళల కోసమే కమిషన్ స్వయంగా వారి చెంతకు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 30 మందికి పైగా మహిళలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎక్కువగా గృహహింస, వెట్టిచాకిరి, వృద్ధులను వేధించడం మొదలైన ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. కొన్ని సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు.సమాజంలో ఏ ఒక్క మహిళ కూడా బాధపడకుండా ఉండేలా రాష్ట్ర మహిళా కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.తొలుత నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కి ఆర్డీవో అనూష ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనాసుజన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, లీగల్ కౌన్సిలర్ పూజిత, సీఐ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :