ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులకు ముఖ్యమైన రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నప్పటికీ, అమలులో మాత్రం జాప్యం కొనసాగుతోంది. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తు చేయగల అవకాశాన్ని ప్రకటించినా, వాస్తవానికి ఆ సేవ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణంగా పౌరులు పెద్ద ఎత్తున సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ సేవ ఇంకా ప్రారంభంకాకపోవడం
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈనెల 15వ తేదీ నుంచి వాట్సా ప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు దర ఖాస్తుదారుల తాకిడి విపరీతంగా పెరిగింది. సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదంటూ అక్కడి ఉద్యోగులు వెనక్కి పంపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో అర్జీదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మండుటెండలో పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల విభజన, సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పు, అనర్హుల కార్డుల సరెండర్, ఆధార్ సీడింగ్ను సరిచేసుకోవడం తదితర 10 రకాల సేవల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈనెల 7 నుంచి అనుమతి ఇచ్చింది.
10 రోజుల్లో 2.44 లక్షల దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పౌరులు పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్నారు. 10 రోజుల్లోనే 2,44,889దరఖాస్తులు వచ్చాయి. ఊహించని విధంగా వస్తున్న దరఖాస్తులతో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,44,889 దరఖాస్తులు అందాయి. వీటిలో కొత్త కార్డుల కోసం 30,614, ఉన్న కార్డుల విభజన కోసం 20,392, కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం 1,79,523, సభ్యుల తొలగింపు కోసం 6,397, తప్పు ఆధార్ సీడింగ్ను సరిచేయడానికి 3,743, కార్డుల సరెండర్ కోసం 260, చిరునామా మార్పు కోసం 3,799 మంది దరఖాస్తులు చేసుకోగా రేషన్ షాపుల రెన్యువల్స్ కోసం 161 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా అధిక సంఖ్యలో దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూన్లో కార్డుల పంపిణీపై అనిశ్చితి?
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల ప్రారంభంలోనే జూన్లో కొత్త కార్డులు అందజేస్తామని ప్రకటించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకొని, వేరు కాపురాలు పెట్టుకున్న జంటలతోపాటు అర్హతలు ఉన్న పేద కుటుంబాల వారు పోటెత్తుతున్నారు. దీంతో అర్జీదారుల హడావుడితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కిటకిటలాడు తున్నాయి. పౌరుల కోసం టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రవేశపెట్టడమే కాకుండా, అవి సమర్థంగా పనిచేసేలా చూడటం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Read also: Andhrapradesh: రైతుల అకౌంట్లో 12500 వేయనున్న కూటమి ప్రభుత్వం
Senior citizens: సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం