Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో రైల్వే వ్యవస్థను మరింత విసృత పరుస్తామని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు జిల్లాలోని కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్ ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తో కలసి ప్రారంభించారు. అదేవిధంగా మందస రోడ్ రైల్వే స్టేషన్ లో బెర్హంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాతపట్నంలో రోర్కెల గుణపూర్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ల నూతన హాల్టు ను స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులతో కలసి ప్రారంభించారు. అంతకు ముందు మూడు చోట్ల ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
Ram Mohan Naidu: మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు
హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి హామీ ఇచ్చి కొద్ది రోజుల్లోనే హాల్ట్ మంజూరు అయ్యేలా కృషి చేసిన రామ్మోహన్ నాయుడుకు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్రుతలు తెలిపారు. ఇంకా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలని కోరారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను విస్తృతం చెయ్యాలని కోరారు. అదే విధంగా నందిగాం రౌతుపురంలో రోడ్డు అభివృద్ధి, టెక్కలిలో ఉన్న రైలు గేటును డబుల్ గేట్గా విస్తృత పరచాలని అచ్చెన్నాయుడు కోరారు. దీనిపై రైల్వే అధికారులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించాలన్నారు.
రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు ప్రసంగం
అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సభ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్లో ట్రైన్ హాల్ట్ కోసం విశేష ప్రయత్నం చేశామని ఉగాది పర్వదినం సమీపంలో అది సాకారం అవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సర్వీస్ ద్వారా స్థానిక రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా మారనుందని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుణపూర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధికి హద్దులు చెరిపేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు అన్నారు. హరిశ్చంద్రపురం స్టేషన్లో ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనే తేడాను ప్రజలు గమనించాలని అన్నారు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్ర పురంలో అభివృద్ధి చేస్తే స్థానికంగా విశేష ఉపాధి వనరులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్లాట్ ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టాపేజి.. ఇలా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. స్టేషన్ ను ఆనుకుని రైల్వే పరిధిలోని 40 ఎకరాలను సైతం అభివృద్ధి చేస్తామని, తద్వారా ఉపాధి అందుతుందని తెలిపారు. వేర్ హౌస్, గూడ్స్ షెడ్, కంటైనర్ టెర్మినల్ లాంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక ప్రజలు కూడా నూతన హాల్ట్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు. రైల్వే జోను విశాఖలో త్వరలో ప్రారంభిస్తామని ఇకపై మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి పనుల కు హామీ
మంత్రి అచ్చెన్నాయుడు కోరిన అభివృద్ధి పనులు కూడా అతి త్వరలో చేరువ చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది లీడర్లు కేంద్ర ప్రభుత్వ స్థలంలో అభివృద్ధికి కేంద్రం నిధులపై ఆశపడతారని కానీ అచ్చెన్నాయుడు అందుకు భిన్నంగా అనుమతులు మీరివ్వండి అభివృద్ధి మేము చేసుకుంటామని అనడం ఆయనకు మాత్రమే చెందిందని కితాబిచ్చారు. పోర్టు ఏర్పాటు ద్వారా అటు రాయ్ పూర్ నుండి ఇటు ఒడిశా వరకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సాల్ట్ భూముల సమస్యను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధి చేస్తూ ఉన్నామని కంపెనీలు రావడమే ఆలస్యం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల హామీతో కూటమి సర్కారు ఉపాధి దిశగా బలమైన అడుగులు వేస్తోందని అన్న రామ్మోహన్ నాయుడు అందుకు ఉత్తరాంధ్రలో కూడా సమాన ప్రాధాన్యత దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ భావాన్ని మరింతగా విస్తృత పరుస్తున్నామని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత దేశం వైపు చూస్తుంటే.. భారత్ వచ్చిన సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉండటం శుభపరిణామం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :