ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన ఒక దారుణ సంఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగింది. యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడటం, వారిలో ఒకరు అత్యాచారం చేసి ఆమె గర్భవతి కావడానికి కారణం కావడం సంచలనం సృష్టించింది. ఈ దారుణంపై బాధిత విద్యార్థిని ధైర్యం చేసి వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసిన తరువాత, మరింత వేధింపులు భరించలేక తన స్వరాష్ట్రమైన ఒడిశాకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణకుమార్, విద్యార్థినిని బెదిరించి లోబరుచుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడగా, ఆ కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటపెట్టవద్దని ప్రొఫెసర్ ఆమెను బెదిరించినట్లు సమాచారం.
News Telugu: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్డీఓలో భారీగా ఉద్యోగాలు
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్ లక్ష్మణకుమార్కు తోడుగా, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్రెడ్డి ఈ దారుణంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. శేఖర్రెడ్డి బాధితురాలికి సంబంధించిన వీడియోలు తీసి, వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ, తన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. గర్భం దాల్చడం, ఆపై ఇద్దరు ప్రొఫెసర్ల వేధింపులను భరించలేకపోయిన బాధితురాలు కొన్ని రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుంది. లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణకుమార్ను డిసెంబర్ 1న సస్పెండ్ చేసింది.

యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణకుమార్, శేఖర్రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్ఫోన్లను సీజ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ డిజిటల్ ఆధారాల ద్వారా వేధింపులకు సంబంధించిన కీలక సమాచారం లభించవచ్చని భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తుతో పాటు, ఈ లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేకంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ని కూడా నియమించినట్లు తెలుస్తోంది. విద్యారంగంలో ఇలాంటి కీచక పర్వాలు జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/