భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె సాయంత్రం 4:40 గంటలకు ఐఎన్ఎస్ డేగా (INS Dega) నౌకాదళ విమానశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఉన్నత స్థాయి నౌకాదళ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలకనున్నారు. పర్యటనలో భాగంగా నేడు నౌకాదళ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో రాష్ట్రపతి పాల్గొని, ఉన్నతాధికారులతో భేటీ అవుతారు.
TG Govt : సన్నవడ్లు పండించే రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ ఫిబ్రవరి 18న జరిగే ‘అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ’ (IFR). భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో సుమారు 50 దేశాల నుండి 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు మరియు 50కి పైగా విమానాలు పాల్గొంటున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రపతి ‘ప్రెసిడెన్షియల్ యాచ్’ (INS సుమేధ) పై ప్రయాణిస్తూ, సముద్రంలో ఆరు వరుసల్లో మోహరించిన యుద్ధనౌకల సామర్థ్యాన్ని సమీక్షిస్తారు. భారత నౌకాదళ చరిత్రలో ఇది మూడవ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కాగా, విశాఖపట్నం రెండోసారి ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
రాష్ట్రపతి పర్యటనతో విశాఖ నగరం విద్యుత్ కాంతులతో ధగధగలాడిపోతోంది. ‘మిలాన్-2026’ బహుపాక్షిక విన్యాసాల్లో భాగంగా ఇప్పటికే వివిధ దేశాల ప్రతినిధులు, నౌకాదళ సిబ్బందితో నగరం కిటకిటలాడుతోంది. ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో జరిగే ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విశాఖలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ పర్యటన భారతదేశ సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, మిత్రదేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com