Prasada Rao: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 నెలల కూటమి పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో డయేరియా కారణంగా నలుగురు వ్యక్తులు మృతి చెందితే, ప్రభుత్వం మాత్రం కేవలం ఒకటి లేదా ఇద్దరు మాత్రమే చనిపోయారని అబద్ధపు లెక్కలు చెబుతోందని ధర్మాన ఆరోపించారు. “ప్రజలు వాంతులు, విరోచనాలతో అల్లాడుతుంటే, వారికి తక్షణ సాయం అందించాల్సింది పోయి.. పోస్టుమార్టం నివేదికల పేరుతో కాలయాపన చేయడం దారుణం” అని మండిపడ్డారు.
Read Also: Public Health: పాలూ, తాగునీరు కల్తీ.. ప్రజారోగ్యంపై పెరుగుతున్న ముప్పు
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత
ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందించాలనే గత ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రైవేటీకరణ పేరుతో తుంగలో తొక్కారని ధర్మాన విమర్శించారు. రాజధాని పేరుతో డబ్బునంతా ఒకే చోట కుమ్మరిస్తూ, జిల్లాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. సాగుకు యూరియా అందక రైతులు, ఇంగ్లీషు మీడియం చదువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేకపోగా, క్వింటాల్కు రెండు కిలోల చొప్పున అదనంగా దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
శ్రీకాకుళం అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్లు అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించిన ఆయన ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: