Potti Sriramulu 125th Jayanti: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం (మార్చి 16, 2026) నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కలెక్టర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Read Also: Nellore Railway Station Fire Accident: రైల్వేస్టేషన్ లో స్వల్ప అగ్నిప్రమాదం
దేశానికే దిశానిర్దేశం చేసిన మహనీయుడు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాతో పొట్టి శ్రీరాములుకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష దేశ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించిందని కొనియాడారు. ఆ మహనీయుని దూరదృష్టి వల్లే నేడు పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమైందని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Potti Sriramulu 125th Jayanti: అమరావతిలో 58 అడుగుల విగ్రహావిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అన్ని మండల, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

జువ్వలదిన్నెను మెమోరియల్ సెంటర్గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్సీ బీద
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారి కుటుంబ మూలాలు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఆ మహనీయుని జ్ఞాపకార్థం జువ్వలదిన్నెను ‘శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ సెంటర్’గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గ్రామంలో రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతం చేశామని, ఆయన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు నిరంతరం ప్రేరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, అర్బన్ తహశీల్దారు షఫీమాలిక్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: