వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే పోసాని కృష్ణమురళిని లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్, కోర్టు విచారణ, రిమాండ్ చేయడం ఇవ్వని చీకటి రాజకీయాలకు నిదర్శనమని అంబటి అన్నారు. ఇది టీడీపీ-జనసేన ప్రభుత్వ దుర్మార్గమైన కుట్రగా అభివర్ణించారు.
టీడీపీ నేత పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఏమంటారని ప్రశ్న
పోసాని వ్యాఖ్యలు అనుచితమని భావిస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ నేత పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఏమంటారని అంబటి ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు, అనుచిత పదజాలానికి ఉదాహరణలేనని, అయితే అప్పట్లో వారిపై ఏ చర్యలు తీసుకోలేదని తెలిపారు. పోసాని కంటే వారే ఎక్కువ బూతులు మాట్లాడారా? లేదా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని అంబటి వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్షతో వేధిస్తున్నారు
అంబటి రాంబాబు తన వ్యాఖ్యల్లో, వైసీపీకి చెందిన నాయకులు ప్రభుత్వ దాడులకు గురవుతూనే ఉన్నారని, రాజకీయ కక్షతో వారిని వేధిస్తున్నారని చెప్పారు. విపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ, జనసేన నేతలు చేసిన ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యల గురించి ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాజకీయ ప్రతీకారంతోనే పోసాని విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

పోసాని కృష్ణమురళికి వైసీపీ సంపూర్ణ మద్దతు
పోసాని కృష్ణమురళికి వైసీపీ సంపూర్ణ మద్దతుగా ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు త్వరలోనే స్పందిస్తారని, టీడీపీ కూటమి చేపట్టిన కక్ష సాధింపు చర్యలు ఎక్కువ కాలం నిలవవని హెచ్చరించారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై చేయబడిన దాడి కాదని, ఇది వైసీపీని అణిచివేసే కుట్రలో భాగమని ఆరోపించారు.