ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పశ్చిమ బెంగాల్ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని అవమానించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ విద్యార్థిని షర్మిష్ఠ పనోలిని అరెస్ట్ చేసిన కోల్కతా పోలీసుల చర్యను ఉద్దేశిస్తూ, అదే ధోరణిని టీఎంసీ నేతల పట్ల ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.
న్యాయ విద్యార్థినిపై వెంటనే అరెస్ట్ – రాజకీయ నేతలపై మౌనం ఎందుకు?
Pawan Kalyan: ఈ మేరకు పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ (Twitter) వేదికగా స్పందించారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యాయ విద్యార్థిని షర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలు కొందరికి బాధ కలిగించాయి. ఆమె తన తప్పును ఒప్పుకుని, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పారు.
బెంగాల్ పోలీసులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. కానీ, టీఎంసీకి చెందిన ఎన్నికైన నాయకులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన తీవ్ర మనోవేదన సంగతేంటి? మా విశ్వాసాన్ని ‘చెత్త ధర్మం’ (గందా ధర్మ్) అన్నప్పుడు ఆగ్రహం ఎక్కడ? వారి క్షమాపణ ఎక్కడ? వారిని ఎందుకు వెంటనే అరెస్ట్ చేయలేదు? దైవదూషణను ఎప్పుడూ ఖండించాల్సిందే” అని పవన్ కల్యాణ్ తన పోస్టులో ఘాటుగా పేర్కొన్నారు.
“చెత్త ధర్మం” వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఈ ఏడాది మార్చిలో కోల్కతాలో జరిగిన ఈద్ సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రసంగానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ను కూడా పవన్ కల్యాణ్ తన పోస్టుకు జత చేశారు. ఆ ప్రసంగంలో, బీజేపీ ఒక ‘చెత్త ధర్మాన్ని’ సృష్టించిందని, ఆ ‘జూమ్లా’ పార్టీ సృష్టించిన ‘చెత్త ధర్మాన్ని’ తాను విశ్వసించనని, ఈ ‘చెత్త ధర్మం’ హిందూ ధర్మానికి వ్యతిరేకమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
లౌకికవాదం ఎంచుకున్నవారికి ఒకేలా వర్తించాలి: పవన్ సూచన
లౌకికవాదం అనేది కొందరికి రక్షణ కవచంగా, మరికొందరికి కత్తిలా ఉండకూడదని, అది రెండు వైపులా సమానంగా ఉండాలని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హితవు పలికారు. “పశ్చిమ బెంగాల్ పోలీసులారా, దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది. అందరికీ న్యాయం చేయండి” అని ఆయన కోరారు.
క్షమాపణ తెలిపినా… అరెస్టు ఎందుకు?
షర్మిష్ఠ సోషల్ మీడియాలో చేసిన పోస్టును తొలగించి, మే 16న క్షమాపణలు తెలిపినప్పటికీ ఆమెను వెంటనే అరెస్ట్ చేశారని పవన్ తెలిపారు.
అయితే, ఎంపీలుగా ఉన్న టీఎంసీ నాయకులు అంతకుమించి వ్యాఖ్యలు చేసినా వారిని ప్రశ్నించని తీరుపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఇది ద్వంద్వ ధోరణికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ‘‘వారి క్షమాపణ ఎక్కడ? వారి అరెస్టులు ఎప్పుడవుతాయి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
లౌకికవాదం అందరికీ సమానంగా వర్తించాలి: పవన్ కల్యాణ్
కాగా, 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ఠను అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్ట్ చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం గురుగ్రామ్లోని ఆమె నివాసం వద్ద అరెస్ట్ చేశారు. శనివారం ఆమెను అలీపూర్ కోర్టులో హాజరుపరచగా, జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. మే 14న వజాహత్ ఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
షర్మిష్ఠ ఇస్లాంను అవమానించిందని, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు.
అయితే, తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించాలనుకోలేదని, మే 16న షర్మిష్ఠ ‘ఎక్స్’ ద్వారా క్షమాపణలు తెలియజేశారు.