ప్రపంచంలోని అనేక దేశాలు పలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి. వాతావరణంలో సంభవించే ఆకస్మిక మార్పులకు, అధిక వర్షాలకు, వరదలకు జనజీవితం అతలాకుతలం కావడం చూస్తున్నాం. ప్రకృతి విపత్తుల వలన సంభవిస్తున్న పరిణామాలు అత్యంత భయానకంగా ఉంటున్నాయి. ఈ అనర్ధాలను అను భవాలను, పాఠాలుగా స్వీకరించి, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి తగ్గించడానికి అంతర్జాతీయ వేదికలు కృషి చేస్తున్నాయి. మానవ మేథస్సు కంటే ప్రకృతి అత్యంత బలీయమైనది. ఎన్నో పరిశోధనలు జరిగినా, ఎన్నో ఆవిష్కరణలు జరిగినా ఇప్పటివరకు మానవుడు మృత్యువును, ప్రకృతిని జయించలేకపోయాడు. రోగానికి వైద్యపరంగా చికిత్స అందించవచ్చు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించవచ్చు. కాని ప్రకృతి విలయాలను ఆపడంసాధ్యం కాదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రకృతివిపత్తుల (Natural disasters) వలన సంభవించే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా కనీస స్థాయికి తగ్గించే అవకాశాలున్నాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీని అంతర్జాతీయ విపత్తులతగ్గింపు దినోత్సవం (ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డే) గా పాటిస్తున్నది. ప్రకృతిలో సంభవించే తీవ్రమైన పరిణామాలను ‘విపత్తు’ అని నిర్వచించవచ్చు. ప్రపంచాన్ని ఎలాంటి విపత్తులు లేకుండా కాపాడాలనే మానవ సంకల్పానికి వికల్పమే వైపరీత్యం. వర్తమానంలో సంభవిస్తున్నప్రకృతి విపత్తుల్లో చాలా వరకు మానవ తప్పిదాలే కారణమవుతున్నాయి. వరదలు, భూకంపాలు, తుఫానులు, సునామీలు ఇత్యాదులన్నీ సహజ విపత్తులు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించి, విధ్వంసం చేసి, కోలుకోలేని విధంగా మానవజీవితాలను అతలాకుతలం చేసిన అనేక సంఘటనలు ఈ ప్రపంచంలో సంభవించాయి. అతివృష్టి వలన వరదలు సంభవించడం, ప్రజాజీవితాన్ని స్థంభింపచేయడం, అనావృష్టి వలన పంటలన్నీ ఎండిపోయి, ఆహారోత్పత్తి దెబ్బతినడం త్రాగడానికే నీరు లేక కటకటలాడడం మనం చూస్తున్నాం. వీటన్నింటినీ విపత్తులుగా పేర్కొనవచ్చు. జన జీవనానికి తీవ్ర విఘాతం కలిగించి, జీవనోపాధిని దెబ్బతీసి, ప్రాణాలకు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం కలిగిం చడంలో ప్రకృతి విపత్తుల పాత్ర అధికం. ప్రకృతి వైపరీత్యాల (Natural disasters)నుండి కోలుకుని, జనజీవనం సాధారణ స్థితికి రావడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజజీవనాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాల, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల అవసరం ఎంతైనా ఉంది.
మానవ జీవితాలను అతలాకుతలం చేసే ఇలాంటి ప్రమాదాలన్నీ సాధారణ స్థాయిని దాటి తీవ్రమైన స్థితికి చేరడం వలన విపరీతమైన ప్రాణనష్టం జరుగుతున్నది. ప్రకృతి వైపరీత్యాల్లో వాతావరణ పర్యావరణ, సంబంధమైన అంశాలు మిళితమై ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడుతున్న వైప రీత్యాల్లో మానవ ప్రేరిత వైపరీత్యాలదే సింహభాగం. ఈ సంవత్సరం మయన్మార్, థాయ్లాండ్, వియత్నాం దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి ఆకాశహర్మ్యాలు నేలమట్టమయ్యాయి. ఫిలిప్పీన్స్ లో సంభవించిన భూకంపం విధ్వం సం సృష్టించింది. పాక్ వంటి దేశాల్లో వరదల కారణంగా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగిన ప్రకృతి విధ్వంస (Natural disasters) ఫలితాలను మరువలేం. భారతదేశంలోని పలు రాష్ట్రాలు వరదల వలన అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బుడమేరు వరదలు ప్రజాజీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసాయి. హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయమై పోతున్నాయి. మానవ తప్పిదాలు మహోగ్రరూపం ధరించి మహా ఉపద్రవాలకు కారణభూతమవుతున్నాయి. ప్రకృతిని పరిరక్షించకపోవడమే సకల అనర్థాలకు కారణం. ఈ భూప్రపంచంలో మానవమనుగడ కొనసాగించాలంటే పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలి. స్వార్థ ప్రయోజనాల కోసం చెట్లను నరికే విధానం మారాలి. వృక్షజాతిని పెంపొందించాలి. మొక్కలనునాటే కార్యక్రమాన్ని దైవభక్తి, దేశభక్తితో ముడిపెట్టాలి. అప్పటివరకూ మొక్కలు నాటేకార్యక్రమం ఊపందుకోదు. చెట్లను పెంచడం వలన భూ తాపం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి మనం పీల్చేగాలిలో నాణ్యతా శాతం పెరుగుతుంది. అనారోగ్య సమస్య లు అరికట్టబడతాయి. వాతావరణం చక్కబడుతుంది. పచ్చనిచెట్లను నరకడం వలన వాతావరణంలో సమతుల్యత దెబ్బ తింటున్నది. మానవాళికి అవసరమైన ప్రాణవాయువులభిం చడం లేదు. కాలుష్యం పెరిగి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మానవ మనుగడకురక్షాకవచమైనఓజోన్ పొర దెబ్బతినడం వలన రేడియోధార్మికత వెలువడుతు న్నది. దీనివలన అనేక విపత్కరపరిణామాలు సంభవిస్తు న్నాయి. వాతావరణంలో అవాంఛనీయ పరిణామాలకు మనదే బాధ్యత. గ్లోబల్ వార్మింగ్ ఒకవిషమ సమస్య. ఈ విషమ సమస్యకు విరుగుడు మనచేతుల్లోనే ఉంది. భారత దేశంలోని సముద్రతీర ప్రాంతాలుతరచూ తుఫానులకు గురౌతున్నాయి. నదులన్నీ పోటెత్తి వరదలు ముంచెత్తుతున్నాయి.
ఉత్తరభారతంలో సంభవించిన విలయాలను విస్మ రించలేం. ఆంధ్రప్రదేశ్లో గతంలో సంభవించిన కోనసీమ తుఫానుసృష్టించిన బీభత్సాన్ని, 1977 వ సంవత్సరంలో దివిసీమ ఉప్పెన సంఘటన దుష్ఫలితాలను, ఉత్తర కోస్తాలోసంభవించిన హుద్ హుద్ తుఫాన్ విలయాన్ని, టిట్లీతుఫాను సృష్టించిన భయానక సంఘటనలను తలచుకుంటే గగ్గుర్పాటు కలుగకమానదు. కోస్తా తీరప్రాంతం తరచూ తుఫాను కోరల్లో చిక్కుకుని, ప్రళయగర్జన చేస్తున్నది. అపారమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవిస్తున్నది. వరదల కారణంగా చేతి కొచ్చిన పంటలన్నీ సర్వనాశనమోతున్నాయి. ప్రజల ఆస్తులకు,ప్రాణాలకు విపరీతమైన నష్టం వాటిల్లడం తరుచూ జరుగు తున్న ప్రకృతి ప్రకోప సంఘటనల పర్యవసానమే. ఇక భూకంపాలు కూడా విపత్తే ప్రపంచంలోనూ, మన దేశంలోను సంభవించిన పలు భూకంపాలు విపరీతమైన నష్టం కలుగచేయడం విదితమే. గతంలో జరిగిన భూకంపాల వలన చిలీ వంటి దేశం చిగురుటాకులా వణికిపోయింది. జపాన్లోతరచూ సంభవించే భూకంపాల గురించి ప్రత్యేకంగా పేర్కొ నవలసిన అవసరం లేదు. ఇరాన్, ఇరాక్లోనూ, మరికొన్నిదేశాల్లోను గతంలో ఎన్నో భూకంప ప్రళయాలు సంభవిం చాయి. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ భూకంప విలయాన్ని మరచిపోలేము. భూకంపాలు సంభవించడంలో కూడా మానవ తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వాయర్ల నిర్మాణం, నీటి ప్రాజెక్టులు, క్వారీలు, లోతైన బోరు బావులు భూకంపాలకు కారణమోతున్నాయి. అసాధారణరీతిలో సాగుతున్న భూగర్భ సంపద వెలికితీత ప్రక్రియ భూకంపాలకు కారణభూతమోతున్నాయి. ప్రకృతి, పర్యావ రణ,వాతావరణ సంబంధిత విపత్తుల్లోను, మానవ వైఫ ల్యాలవలన జరుగుతున్న విపత్తుల్లోను అపారమైన ప్రాణ నష్టంజరగడం బాధాకరం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిం చిన ప్రగతి మానవ సుఖజీవనానికి వినియోగపడడం శుభదాయకమే అయినప్పటికీ, మానవ విజ్ఞానం వెర్రితలలు వేసి, అసలుకే ఎసరు పెడుతున్నది. విపత్తులకు మూలకారణమౌతున్నది. మానవ స్వార్థ ప్రయోజనాల ఫలితంగా ఏర్పడు తున్న విపత్తులను అరికట్టడం కొంతవరకు మన చేతుల్లోనే ఉంది. అలాగే ప్రకృతి సంబంధిత విపత్తుల వలన జరిగే ప్రాణ, ఆస్తినష్టాలను కనీస స్థాయికి తగ్గించడం కూడా సుసాధ్యమే. ఇందుకు ప్రభుత్వాలు, ప్రజలు కంకణబద్ధులుకావాలి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా ఇదేవిధమైనఆలో చనలతో ప్రజలను జాగృతం చేయాలని భావించి 2009 వ సంవత్సరంలో ఒక తీర్మానంచేసింది. అంతర్జాతీయవిప త్తుల తీవ్రతను తగ్గించేందుకు ప్రజల ప్రేరణతో ఒక ఉద్య మంగా మలచడానికి ప్రతీఏటా అక్టోబర్ 13వ తేదీననిర్వ హించే ‘ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిస్క్రిడక్షన్ డే’ఒక అవగా హనా కార్యక్రమం. ఎన్నిసంస్థలు ఎన్నివిధాలుగా కృషచేసినా, ప్రజాచైత్యన్యం, ప్రజాభాగస్వామ్యం లేనిదే ఏ ప్రయత్నమై నా నిర్వీర్యం కాక తప్పదు. కాబట్టి లోకకల్యాణార్ధంచేపట్టే కార్యక్రమాలకు, సంకల్పానికి వికల్పం కలగకుండా చూడవల సిన బాధ్యత ప్రజలపైన, ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది.
-సుంకవల్లి సత్తిరాజు
ప్రకృతి వైపరీత్యం అంటే ఏమిటి?
మానవ చర్యల వల్ల కాకుండా ఇతర శక్తుల వల్ల సంభవించే విస్తృత విధ్వంసం, భారీ నష్టాలు లేదా ప్రాణనష్టానికి కారణమయ్యే ఆకస్మిక సంఘటనను ప్రకృతి వైపరీత్యం అంటారు.
మానవ నిర్మిత విపత్తులు?
మానవ నిర్మిత విపత్తులు అనేవి మానవ చర్యలు మరియు సామాజిక ప్రక్రియల వల్ల సంభవించే తీవ్రమైన హానికరమైన సంఘటనలు . సాంకేతిక ప్రమాదాలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఎందుకంటే అవి మానవ ప్రేరేపిత విపత్తులకు కారణమవుతాయి. మానవ నిర్మిత ప్రమాదాలను కొన్నిసార్లు మానవజన్య ప్రమాదాలు అని పిలుస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: