తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు, నేతృత్వపు పునర్వ్యవస్థీకరణకు వేదికగా మారబోతున్నదా మహానాడు? గత కొంతకాలంగా పార్టీకి పునరుత్తేజం, యువతలో నూతన ఆత్మవిశ్వాసం నింపే దిశగా నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో నారా లోకేశ్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. ముఖ్యంగా మంత్రులు, సీనియర్ నేతలు, ఖచ్చితంగా పార్టీతో నిబద్ధత ఉన్న కార్యకర్తలంతా ఇదే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు.
పార్టీ పునర్నిర్మాణంలో లోకేశ్ పాత్ర
టీడీపీని నడిపించాలంటే యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించాల్సిన అవసరం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. “యువతలో లోకేశ్ కు మంచి ఆదరణ ఉంది. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నందున, పార్టీ బాధ్యతలను పూర్తిగా లోకేశ్ కు అప్పగించాలి. ఇదే పార్టీ కార్యకర్తలు, శ్రేణుల కోరిక” అని ఆయన అన్నారు.
టీడీపీ మంత్రుల, సీనియర్ నేతల స్పందన:
పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించారు. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయంలో ఈ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని ఆయన నొక్కిచెప్పారు. లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
మహానాడు 2025 – కీలక మలుపు:
ఈ ఏడాది మహానాడు సభలు పార్టీకి మలుపుతిరిగే సంఘటనల వేదికగా మారనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్గా వ్యవహరిస్తున్న జీవీ ఆంజనేయులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలన్నది క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయం. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం అని ఆయన తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువ నాయకత్వం ఎంతో అవసరమని, లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ద్వారా పార్టీ కేడర్లో నూతనోత్సాహం నింపవచ్చని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో, మహానాడు వేదికగా లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడాన్ని ప్రకటిస్తే, అది పార్టీ కార్యకర్తలే కాకుండా, యువతలోనూ గణనీయమైన ప్రభావాన్ని చూపించగలదు.
Read also: Kandula Durgesh : జూన్ లో గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన