గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచెత్తుతున్నాయి. నగరంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Municipal Minister Ponguru Narayana) శనివారం విజయవాడకు వచ్చారు. మంత్రితో పాటు పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.విజయవాడ నగరంలో ప్రధానమైన డ్రెయినేజీ సమస్యలను దగ్గర నుంచి గమనించిన మంత్రి నారాయణ, పుల్లేటి కట్ట, దర్శిపేట అవుట్ఫాల్ డ్రెయిన్లు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు సజావుగా వెళ్లకపోవడానికి కారణంగా ఉన్న అక్రమ నిర్మాణాలను అక్కడే ఉన్న అధికారులను సూచించి తొలగించాలన్నారు. డ్రెయిన్లు పూర్తి సామర్థ్యంతో పని చేయాలంటే అవి నిర్మాణం చేసిన దిశగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలన్నారు.
ప్రణాళికలు సిద్ధం
ఆటోనగర్ డంపింగ్ యార్డ్ను సందర్శించిన మంత్రి, అక్కడి పరిస్థితులను కూడా సమీక్షించారు. డ్రెయిన్లు, కాలువలలో అక్రమ కట్టడాల వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలుగుతోందని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇళ్లు కోల్పోయిన వారికి టిడ్కో ఇళ్ల (Tidco houses) ను కేటాయించాలని సూచించారు.ఇక గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండగా 2014 నుంచే డ్రెయినేజీ పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని నారాయణ గుర్తుచేశారు. తాము ప్రారంభించిన పనులను గత ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిందని, తద్వారా ఇప్పుడు నగరంలో డ్రెయిన్లు సరైన వెడల్పుతో లేకపోవడమే కాక, కొన్నిచోట్ల కేవలం 2 అడుగుల వెడల్పుతో ఉండటం వల్ల వర్షపు నీరు ప్రవహించలేక సమస్యగా మారిందన్నారు.కేవలం డ్రెయిన్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా, కొన్ని కాలువల్లో అక్రమంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించడంతో సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు
కాలువలలో ప్రహరీ గోడలు కట్టడం వల్ల వాటిని విస్తరించలేకపోతున్నామని, ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పేదలను ఇబ్బందులు పెట్టాలనేది తమ ప్రభుత్వం ఉద్దేశం కాదన్న మంత్రి నారాయణ, డ్రెయిన్లు వెడల్పు చేయకపోతే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అక్రమణలను గుర్తించి, డ్రెయిన్లు వెడల్పు చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ను మంత్రి నారాయణ ఆదేశించారు. ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, అలాంటి చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాలతో చర్చిస్తారని నారాయణ వెల్లడించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, సీఆర్డీఏ నిధులతో విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరుస్తామని, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు. వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ వాసులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు.
మంత్రి నారాయణ గారి విద్యా నేపథ్యం ఏమిటి?
నారాయణ గారు ఒక విద్యావేత్తగా పేరు పొందారు. ఆయన “నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్” స్థాపకుడు, విద్యారంగంలో తనదైన ముద్ర వేశారు.
ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏవైనా ఉన్నాయా?
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన అమరావతి రాజధాని ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Chandrababu Naidu: నేడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు