ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం మంగినపూడి బీచ్ (Manginapudi Beach) వద్ద నేడు ‘మసులా బీచ్ ఫెస్టివల్’ (Masula Beach Festival)ఘనంగా ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఈవెంట్గా గుర్తింపు పొందిన ఈ ఫెస్టివల్ జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు నలుగురు రోజులపాటు సాగనుంది. సముద్ర తీరంలోని అందాలను పరిచయం చేయడమే కాకుండా, పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
“గేట్వే ఆఫ్ అమరావతి” ఐకాన్ ప్రత్యేక ఆకర్షణ
ఈ కార్యక్రమంలో “గేట్వే ఆఫ్ అమరావతి” ఐకాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బుల్లితెర తారల సందడి, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మచిలీపట్నం నుండి బీచ్ వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులు నడపడం ద్వారా ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పర్యాటకులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక క్రీడా మైదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
ఫెస్టివల్లో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం, వాటర్ స్పోర్ట్స్, వాలీబాల్ పోటీలు, కబడ్డీ ఛాంపియన్షిప్ వంటి అనేక వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యువత, కుటుంబాల కోసం ప్రత్యేక క్రీడా మైదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. సముద్రతీరంలో అందమైన సాయంకాలాన్ని ఆస్వాదిస్తూ, ఉత్సవ వాతావరణాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది ఒక అద్వితీయ అవకాశం.
Read Also : E-Lottery : నేడు రాజధాని రైతుల ప్లాట్లకు ఈ-లాటరీ