దేశానికి వెన్నెముక అయిన రైతు అన్నదాతగా వ్యవ సాయ రంగంలో ఎదురు అవుతున్న అనేక అవరోధాల మధ్య దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రజల జీవనానికి అవసరమైన నిత్యవసర ఆహార ఉత్పత్తు లను, వ్యాపార వాణిజ్య పంటలను రైతులు సమృద్ధిగా పండిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డుల (Market yards)ద్వారా అమ్మ కాలు జరిపి వినియోగదారులకు అందించేందుకు నిర్విరామ కృషి చేస్తున్నప్పటికీ, వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్ణయించే ధరలు రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించే స్థాయిలో లేకపోతున్నాయా అనే వాదనలు రైతాంగం నుండి వినిపిస్తుంటాయి. పెట్టుబడి పెట్టి పండించిన పంట లను రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చి నప్పుడు మార్కెట్ కమిటీ నిర్ణయించిన ధరలు లాభసాటిగా ఉన్నా లేకున్నా అమ్మకాలు జరిపి రావాల్సిన పరిస్థితిలో రైతాంగం ఉందనే భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఒకవేళ లాభసాటిగా లేని ధరకు అమ్మడానికి ఇష్టం లేకపోయినా మార్కెట్కు తీసుకొచ్చిన పంటదిగుబడిని తిరిగి మళ్లీ వెనక్కి తీసుకుపోవడం భారంతో కూడిన పని. మద్దతు ధర పలికే వరకు నిలువ ఉంచాలన్నా కోల్డ్ స్టోరేజీల్లో రోజు వారీ కిరాయి కట్టవలసిందే. సొంత రవాణా ఖర్చు భరించాల్సిందే, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మధ్య దళారీలు రైతులకు ఎక్కువ ధర ఆశ చూపి కొనుగోలు చేసుకునే క్రమంలో రైతులు మధ్య దళారుల చేతుల్లో మోసపోతున్న సంఘటనలు అడపాదడపా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సాధారణంగా రైతులు పండించిన వరి, మొక్కజొన్న, గోధుమ, పప్పు దినుసులు తదితర ఆహార పంటలతో పాటు పత్తి, పసుపు, మిరప లాంటి వాణిజ్య పంటలను అమ్మకానికి కొనుగోలుకు వేదికగా వ్యవసాయ మార్కెట్ యార్డులు (Market yards) ఉంటున్నాయి. వ్యవసాయ మార్కెట్లో ఆయా పంటలకు నిర్దిష్టమైన ధరను ప్రభుత్వం మార్కెట్ కమిటీ నిర్ణయం మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులను మారె్కట్ యార్డులు కొనుగోలు చేసి తిరిగి కావలసిన వారికి విక్ర యాలు చేయడానికి ఒక నిర్దిష్టమైన చట్టబద్ధత కలిగినటువంటి వేదికగా వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉంటున్నప్పటికీ రైతుల విషయంలో మార్కెట్ యార్డులు అనుకున్న స్థాయిలో రైతులకు లాభాలు చేకూర్చే విధంగా గిట్టుబాటు ధరలు ఉండటం లేవనే భావన రైతాంగంలో లేకపోలేదు.
Read Also: Saudi: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దుతో 25 లక్షల భారతీయ కార్మికులకు విముక్తి

తూకంలో హెచ్చుతగ్గులు
రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చినప్పుడు తూకం వేసే విధానంలో గతంలో అనేక లోటుపాట్లు తెరపైకి వచ్చినా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో తూకం నిర్వహిస్తున్నా, తరచుగా మిషన్లలో సాంకేతిక లోపాలు ఏర్పడడం, కొన్ని సార్లు తూకంలో హెచ్చుతగ్గులు గోచరిస్తుండటంతో రైతులలో గందరగోళ పరిస్థితులు నెలకుంటున్నాయా అనే సంశయం కలుగక మానదు. ఇలాంటి సందర్భాల్లో రైతులు పండించినపంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులు నిర్దిష్టమైన వేదికగా ఉంటూనే రైతుల నుండి పంటలు కొనుగోలు చేసే క్రమంలో అయినా, వినియోగదా రులకు విక్రయించే రీతిలో గానీ విశ్వసనీయతతో పురోగతి సాధించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు క్షేత్రస్థాయి లో మరింత కార్యచరణను చేపట్టాల్సిన అవసరం ఉంటుం దేమో. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పండించిన పంటను ఆన్లైన్లో అమ్ముకోవడానికి ఇ మార్కెట్ విధానం తీసుకు వచ్చిన ప్పటికీ, తరచుగా టెక్నికల్ విషయంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడవలసిన
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ విధానంలోకి తీసుకు రావడానికి ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం రైతులకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వాటి పనితీరును ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునే రీతిలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీలు వీలైనం తగా చూడగలిగితే రైతుకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర మార్కెట్లో ఉన్నప్పుడు ధరను ముందుగా రైతులు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి పండించిన పంటను గిట్టుబాటు ధర ఉన్నప్పుడు సరైన సమయంలో మార్కెట్ యార్డ్లకు రైతులు తీసుకుని రావడానికి మరింత ఆసక్తి చూపుతారు.

ఒప్పందాలతో సమస్యలు
వ్యవసాయ మార్కెట్ చట్టాల ప్రకారం కాంట్రా క్టు పెట్టుబడి వ్యాపారులు కొంతమంది నేరుగా రైతులను కలుసుకుని పంటచేతికి వచ్చే వరకు ఖర్చును భరిస్తామని, పండించిన పంటను తామే కొని విక్రయిస్తామనే రీతిలో ఒప్పందాలు జరుపుకుంటున్నప్పటికీ, తరచుగా ఇలాంటి ఒప్పందాలతో పెట్టుబడి దారులకు రైతులకు మధ్య అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్టు తీసుకున్న సమ యానికి పంట చేతికి వచ్చి సరైన దిగుబడి వచ్చిందంటే సమస్య లేదు. కానీ పరిస్థితులు అనుకూలించక పండించిన పంటకూడా అనుకున్న రీతిలో రాకపోవడం వల్ల కష్ట పడి పంటలు పండించే రైతులు, కాంట్రాక్టు వ్యాపారుల మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. వీటి వలన ఎక్కు వగా నష్టపోయేది రైతులే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దళారులు మోసం చేసిన నష్టపోయేది రైతులే, మార్కెట్ యార్డులో నష్టం వచ్చినా నష్టపోయేది రైతులే, ప్రకృతి కన్నెర్ర చేసినా నష్టపోయేది రైతులే. ఎటుచూసినా నష్టపోయేది రైతులే అనే విషయం విస్మరించరాదు. ఏది ఏమైనప్పటికీ రైతులుపండించిన పంటకు వ్యవసాయమార్కెట్ యార్డుల ద్వారా తగిన రీతిలో గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతులు లబ్ధి పొందవలసి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యవసాయరంగ నిపుణులలో లేకపోలేదు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డు లు గతంతో పోలిస్తే కొంత ఆధునికరించబడినప్పటికి, అన్నదాతలు చాలావరకు మధ్య దళారీల చేతుల్లో నష్ట పోకుండా పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధరవచ్చే విధంగా రైతన్నలకు భరోసా ఇచ్చే విధం గా మార్కెట్ యార్డుల నిర్వహణ మరింతగా ప్రామాణికంగా కచ్చితత్వం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది.
– దాడిశెట్టి శ్యామ్ కుమార్
మార్కెట్ యార్డ్ అంటే ఏమిటి?
మార్కెట్ యార్డ్ అనేది వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (APMC) ఆధ్వర్యంలో పనిచేసే ఒక వ్యవస్థీకృత మార్కెటింగ్ వ్యవస్థ. దీని ప్రధాన లక్ష్యం రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడం, తద్వారా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు మెరుగైన ధరను అందించడం.
మార్కెట్ యార్డ్ ముఖ్య ఉద్దేశ్యాలు?
రైతులు తమ పంటలకు సరైన ధర పొందేలా చూడటం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లు ఒక క్రమపద్ధతిలో జరిగేలా నియంత్రించడం. మార్కెట్ యార్డులో నిల్వ, గిడ్డంగి, గ్రేడింగ్ వంటి సౌకర్యాలు కల్పించడం. మార్కెట్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: