మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan), తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు (Mahanadu) కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ కార్యక్రమం ఒక పెద్ద డ్రామా మాత్రమేనని అన్నారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. టీడీపీ అంటే “తెలుగు డ్రామాల పార్టీ” అని ఎద్దేవా చేశారు. ప్రజలు సూపర్ సిక్స్ పథకాల సంగతి అడుగుతున్నారని, కానీ ఆ పార్టీ నేతలు ఏ ఇంటికైనా వెళ్లి ధైర్యంగా తాము ఏదైనా చేశామని చెప్పలేరని విమర్శించారు.
హామీలు నెరవేర్చడమే హీరోయిజం: జగన్ ఘాటుగా
కడపలో మహానాడు నిర్వహించడం లేదా తనను తిట్టడం హీరోయిజం కాదని, వాస్తవమైన హీరోయిజం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమేనని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సెవెన్ పథకాలు గాలికి వదిలేసినట్టు చెప్పారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టినట్టు ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు ఎదురుచూస్తున్నారన్న జగన్, గ్యాస్ సిలిండర్లు సరఫరా కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. నాడు-నేడు, సీబీఎస్ఈ, టోఫెల్ వంటి విద్యా సంస్కరణలు నిలిచిపోయాయని, పిల్లల ట్యాబ్లెట్ పంపిణీ కూడా ఆగిపోయిందని విమర్శించారు.
అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతుల సంక్షేమం క్షీణం: వైఎస్ జగన్
తమ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిందని జగన్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పాలనలో విద్యా పథకాలు సరిగా అమలవడం లేదని విమర్శించారు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు పనులకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకాన్ని రద్దు చేశారని, ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైందని, రోగులకు వైద్యం అందడం లేదని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లేకుండా, వారు దళారుల పాలవుతున్నారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ. 2.73 లక్షల కోట్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) చేసామని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
Read Also : Israel : చివరి విమానాన్ని ధ్వంసం చేశాం : ఇజ్రాయెల్