విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక ఇంజిన్గా మార్చే దిశగా సాంకేతికత, మౌలిక వసతులు, ప్రజా–ప్రైవేటు భాగస్వామ్యాల సమన్వయంతో ముందుకు సాగుతోందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వివరించారు. నిర్మాణం, రవాణా, పోర్టులు, విమానాశ్రయాలు, మార్కెట్ల మధ్య సమగ్ర అనుసంధానం ద్వారా రాష్ట్రం త్వరలోనే “ఈస్టర్న్ గేట్వే ఆఫ్ గ్లోబల్ లాజిస్టిక్స్”గా అవతరించనుందని చెప్పారు. దేశంలోనే తక్కువ లాజిస్టిక్స్ ఖర్చుతో గ్లోబల్ ప్రమాణాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా సమగ్ర ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, అంతర్గత జలమార్గాల అనుసంధానంతో సమర్థవంతమైన రవాణా నెట్వర్క్ ఏర్పాటే లక్ష్యమన్నారు. దీని ద్వారా సరుకు రవాణా వ్యయం తగ్గి, దేశీయ-అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా సరుకులు చేరనున్నాయని తెలిపారు.
‘Logistics’ engine for state’s economic development
Read also: Narasapur Bangalore Special Trains: ప్రత్యేక రైళ్ల పొడిగింపు: ప్రయాణికులకు ఊరట
ప్రభుత్వం రూపొందించిన లాజిస్టిక్స్ విజన్ మిషన్లో అన్ని రవాణా మార్గాల సమన్వయం, ఆటోమేటెడ్ సప్లై చైన్ వ్యవస్థలు, రియల్ టైమ్ ట్రాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యం ఇచ్చినట్లు కృష్ణబాబు చెప్పారు. పరిశ్రమ పార్కులు, ఎగుమతి ద్వారాల మధ్య కనెక్టివిటీ బలోపేతం చేయడం, గ్రీన్ ప్రాక్టీసులు, టెక్నాలజీ సమన్వయంతో స్థిరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ నిర్మాణం లక్ష్యమని తెలిపారు. మారిటైమ్ పాలసీ–2024 ప్రకారం నౌకా నిర్మాణం, నిర్వహణ, పోర్టు అభివృద్ధి రంగాలకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. రాష్ట్ర లాజిస్టిక్స్ ప్లానింగ్, మానిటరింగ్ కోసం జీఐఎస్, డిజిటల్ డేటా ఇంటిగ్రేషన్తో ఏఐ ఆధారిత నిర్ణయ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు మౌలిక సదుపాయాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 97 కొనసాగుతున్న, 64 ప్రణాళిక దశలో ఉన్న ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. మొత్తం 3,358 కి.మీ పొడవున రూ.76,738 కోట్ల వ్యయంతో రహదారి పనులు 2028 నాటికి పూర్తవుతాయని తెలిపారు.
రైల్వే కనెక్టివిటీలో భాగంగా 652 ప్రాజెక్టులు ప్రగతిలో ఉండగా, 48 ప్రణాళిక దశలో ఉన్నాయని కృష్ణబాబు తెలిపారు. మొత్తం 7,953 కి.మీ పొడవున రూ.3.21 లక్షల కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, 2026-29 మధ్య దశలవారీగా కొత్త రైల్వే లైన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. విమాన రవాణా రంగంలో రాష్ట్రంలో 6 ఆపరేషనల్ విమానాశ్రయాలు ఉండగా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 96.8 శాతం పూర్తై జూన్ 2026లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. మారిటైమ్ రంగంలో మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం డిజిటల్ లాజిస్టిక్స్ వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, లాజిస్టిక్స్ ఇంటెలిజెన్స్ డ్యాష్బోర్డ్, ద్విభాషా మొబైల్ యాప్ ద్వారా ట్రక్ బుకింగ్, సరుకు ట్రాకింగ్ వంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రైతులు, వ్యాపారులు, ట్రాన్స్పోర్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరమని, కమోడిటీ లాజిస్టిక్స్ అధ్యయనంలో గుర్తించిన లోపాలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: