ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పరిపాలనాత్మక మార్పులు చేస్తూ, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి కొత్త కార్యనిర్వాహక అధికారి (EO) గా అనిల్కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) ని నియమించింది. ఈ నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో పెద్ద చర్చనీయాంశమైంది.
ఇప్పటి వరకు టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించిన శ్యామలరావు స్థానంలో అనిల్కుమార్ సింఘాల్ మళ్లీ నియమితులవ్వడం విశేషం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సింఘాల్ గతంలో కూడా టీటీడీ ఈవోగా సేవలు అందించారు. అప్పట్లో ఆయన చేసిన పనితీరు, తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనసును గెలుచుకున్నాయి. మళ్లీ ఈ పదవికి రావడంతో ఆయనపై భక్తులు, సిబ్బంది అంచనాలు మరింతగా పెరిగాయి.
అధికారిక ఉత్తర్వుల రూపంలో
ప్రస్తుతం శ్యామలరావును ప్రభుత్వం జీఏడీ (General Administration Department) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మార్పులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వుల రూపంలో విడుదల చేశారు.మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు. రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. ఏపీ రెవెన్యూ, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్కుమార్ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్గా శేషగిరిబాబు నియమితులయ్యారు. కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను నియమించారు. రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్లాల్ను ప్రభుత్వం నియమించింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.
గతకొన్ని రోజులుగా కసరత్తు జరిపింది
మరోవైపు ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం గతకొన్ని రోజులుగా కసరత్తు జరిపింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. అప్పట్లో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కొనసాగారు. ఆ తర్వాత బదిలీ కాగా.. ఇప్పుడు మరోసారి అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read also: