వైసీపీ నేత, శాసన మండలి వైస్ చైర్పర్సన్గా ఉన్న జాకీయా ఖానమ్ (Zakia Khanum) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ ( BJP) లో చేరిన విషయం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉత్కంఠ రేపింది. ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాకీయాకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక పరిణామం
జాకీయా ఖానమ్ 2022లో గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత రెండు సంవత్సరాలుగా ఆమె పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు, ముఖ్యంగా స్థానిక నాయకత్వంతో విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి, శాసన మండలి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా లేఖ పంపిన అనంతరం ఆమె విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ముస్లిం మైనార్టీ నాయకురాలి బీజేపీ చేరిక
బీజేపీపై “మతతత్వ పార్టీ” అన్న విమర్శలు తరచూ వినిపించే తరుణంలో ముస్లిం మైనార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. బీజేపీలో ఎందుకు చేరారనే విషయంపై ఆమె స్పందిస్తూ, ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల నుంచి మంచి సందేశం ఇచ్చేందుకే తాను పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు.
పురంధేశ్వరి మాట్లాడుతూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, “సబ్ కే సాత్, సబ్ కా వికాస్” అనేది బీజేపీ మూల సిద్ధాంతం అని, బీజేపీలో కుల మతాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అని ఆమె అన్నారు. శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి జాకీయా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జాకీయా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందని పురంధేశ్వరి అన్నారు. మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. జాకీయా ఖానమ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని గుర్తు చేశారు. జాకీయా ఖానమ్ను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆమె అన్నారు. కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆ దిశగానే దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోందని ఆమె తెలిపారు.
Read also: Chandrababu Naidu : కడప మహానాడు ప్రాధాన్యతపై చర్చ : చంద్రబాబు