సద్గురు శ్రీకందుకూరి శివానందమూర్తి జన్మదినోత్సవ వేడుకల్లో వక్తలు
జగ్గయ్యపేట : భారతదేశం మహోన్నతంగా ఎదగాలన్నా పునర్వైభవం సాధించాలన్నా పౌరుల్లో నైతికత శిరోధార్యం కావాలని, రేపటి పౌరులకు ఉత్తమ మార్గదర్శనం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పలువురు వక్తలు ఉద్బోదించారు. (Jaggayyapet) ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు శ్రీగురుధామ్ ధర్మక్షేత్రంలో ఆదివారం సద్గురు శ్రీకందుకూరి శివానందమూర్తి భగవాన్ల 97వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం (Dr. APJ Abdul Kalam) ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత గెంటేల వెంకటరమణ- వసంతలక్ష్మి గురు దంపతులు ఆధ్వర్యంలో శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్టు ఆర్గనైజర్ చిట్టినేని వెంకటేశ్వరరావు- మాధవి దంపతులు, శ్రీగురుధామ్ భక్తబృందం కన్నుల పండువగా వేడుకను శోభాయమానం చేశారు. కార్యక్రమానికి గౌరవ అతిధిగా తెలంగాణా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హాజరయ్యారు.
శ్రీశివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు -2025ను ఇరువురు ఆధ్యాత్మికవాదులు, ముగ్గురు సీనియర్ వైద్యనిపుణులకు ప్రదానం చేశారు. భీమ్లీ నుండి విచ్చేసిన సద్గురు శ్రీశివానందమూర్తి అనుయాయులు రాఘవేంద్రన్, ఆధ్యాత్మికవేత్త రాధాకుమారిలకు వెంకటరమణ దంపతులు ఆత్మీయ సన్మానంచేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అంకాలజిస్ట్ డాక్టర్ సికె నాయుడు, విజయవాడ ఆర్కె ఆసుపత్రి డాక్టర్ ఆర్ ఈశ్వర్, జగ్గయ్యపేట శ్రీరామ హాస్పటల్ శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ బి యోగీరామ్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా సభలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ తమ వివాహానికి సద్గురు శ్రీశివానంద భగవాన్లు ఆశీస్సు లిచ్చారన్నారు. శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తంచేస్తూ తాత్వికులు వెంకటరమణ దంపతులకు నమస్సులు తెలిపారు.
Read Also: AP ABVP: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: కంభంపాటి హరిబాబు

శ్రీశివానంద గురుదేవుల పురస్కార ప్రదానోత్సవం
వెంకటరమణ అనుగ్రహభాషణ చేస్తూ సమాజంలో మంచిని విస్తరింపజేస్తూ ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో స్ఫూర్తిని పాదుకొల్పేవారికి సద్గురు శ్రీశివానంద గురుదేవుల పేరుతో పురస్కార ప్రదానోత్సవాన్ని చేపట్టామన్నారు. (Jaggayyapet) ఆధ్యాత్మికవేత్త రాఘవన్ మాట్లాడుతూ శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం ముక్తికి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ మంచిని, మానవత్వాన్ని, నైతిక విలువలను వృద్ధిచేసే ఈ క్షేత్రం ఆదర్శాన్ని అందిస్తుందన్నారు. అవార్డు గ్రహీతలు డాక్టర్ సికె నాయుడు, డాక్టర్ ఆర్ ఈశ్వర్, డాక్టర్ బి యోగీరామ్ తమ స్పందనను సరళంగా వ్యక్తపర్చారు. సభలో దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన కవితలను గానంగా స్వరపర్చిన ఆయన తనయుడు యోగేశ్వర్ సిడి రూపంలో పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సిరివెన్నెల సతీమణి పద్మావతిని కూడా వెంకటరమణ దంపతులు సభలో సన్మానించారు. సభలో శ్రీశివానందగురు ట్రస్టు ఆర్గనైజర్ చిట్టినేని వెంకటేశ్వరరావు-మాధవి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు ఆనంద శంకర్-డాక్టర్ హర్షిత దంపతులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది గెంటేల అశోక చక్రవర్తి తదితర జగ్గయ్యపేట ప్రాంత ప్రముఖులు, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు. సభకు అధ్యాపకులు డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు అనుసంధానకర్తగా వ్యవహరించారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: