పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం పరామర్శనకు వెళ్లారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటన మాత్రమే కాకుండా, ఒక బాధిత కుటుంబానికి తాను అండగా ఉన్నానని చెప్పిన మానవతా దృక్పథం.
బెంగళూరులోని తన నివాసం నుంచి ప్రత్యేకంగా రోడ్డు మార్గంలో ప్రయాణించి శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లి తండా గ్రామానికి చేరుకున్న జగన్, జవాన్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్ మరియు జ్యోతిబాయిలతో మాట్లాడారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
మురళీ నాయక్ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు
జగన్ నివాళులు అర్పిస్తున్న సమయంలో మురళీ నాయక్ తండ్రి స్పందిస్తూ “మురళీ నీ కోసం జగనన్న వచ్చాడు లేచి సార్ కి సెల్యూట్ కొట్టరా” అంటూ అనడం అక్కడున్న అందరినీ కదిలించింది.
25లక్షల ఆర్థిక సాయం
మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. వైసీపీ తరఫున వీర జవాన్ కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన తిరుగు పయనమయ్యారు. జగన్ పరామర్శ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మురళీ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యక్తిగతంగా మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
Read also: Vijayawada: కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా వాటిని తీసుకెళ్లడానికి పోటీ పడ్డ జనాలు