వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. 2017-2018 మధ్యకాలంలో చేసిన తొలి పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల మద్దతు సంపాదించి, 2019లో 151 అసెంబ్లీ సీట్లతో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్లి వారిపల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో, నాయకత్వాన్ని మళ్లీ ప్రబలంగా నిలబెట్టే ప్రయత్నంలో ఇది భాగంగా కనిపిస్తోంది.
గతంలో పాదయాత్ర విజయాన్ని తెచ్చిందా?
2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర (Paadayatra), రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది. ప్రతి నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా, ఎన్నికల హామీలకు రూపురేఖలు అప్పుడే వేయబడ్డాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అప్పటి పాదయాత్రే ఆయనను ప్రభుత్వాధినేతగా మార్చింది. అయితే 2024లో వైసీపీ కేవలం 11 సీట్లతో పరిమితమవ్వడం, ప్రజల్లో వైఫల్య భావన పెరగడం జగన్ను మళ్లీ పునరాలోచనలోకి నెట్టింది.
CM కుర్చీ మళ్లీ దక్కుతుందా?
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ చేపట్టే పాదయాత్ర ఫలితాలపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇది ప్రజలతో మళ్లీ అనుసంధానం ఏర్పరచేందుకు ఉపకరించవచ్చని ఆయన అనుచరులు నమ్ముతున్నప్పటికీ, మళ్లీ సీఎం పదవి దక్కే అవకాశాలపై స్పష్టత లేదు. ప్రస్తుత టిడిపి-జనసేన-బీజేపీ కూటమి బలంగా నిలిచిన నేపథ్యంలో జగన్కు ఎదురెళ్లే మార్గం సులభమని చెప్పలేం. అయినప్పటికీ, ప్రజల్లోకి వెళ్లే నేతగా జగన్ మళ్లీ ఒక పోరాట యోధుడిగా మారే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తోంది.
Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు