మొంథా తుఫాను ప్రభావం రాష్ట్రంపై మరింత తీవ్రతతో కొనసాగుతోంది. వర్షాలు, తుఫాను గాలుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి ఉప్పెనలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్న తీర ప్రాంతాల్లో స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తూ రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తీర ప్రాంతాల్లో రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కావడంతో అధికారులు పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నారు.
తుఫాను తీవ్రతను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో ఇవాళ్టి నుంచే 31వ తేదీ వరకు విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. నిడదవోలు, రాజోలు, తుని, యానాం సహా అనేక చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, తక్కువ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రయోజనంగా బయటకు వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
అటు మరోవైపు APSDMA తాజా నివేదిక ప్రకారం.. రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశముందని అంచనా వ్యక్తం చేసింది. తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వరదనీరు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున నదీ తీరాలు, కుంటలు, వాగులు సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 104 , 108 హెల్ప్లైన్లకు సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/