ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను హఠాత్తుగా రద్దు చేయడంపై వాహన డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించారు. తాము 2027 వరకు వాహనాలపై తీసుకున్న రుణాలను చెల్లించాల్సి ఉంది అని, ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు. అంతేకాకుండా ఆర్థిక పునరావాసం లేదా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ మేరకు హైకోర్టు ప్రభుత్వం వైఖరిపై సీరియస్గా స్పందించింది. వాహనాలను ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డ్రైవర్ల భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు పరిణామాలు వేలాది మంది డ్రైవర్ల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.
ఉద్యోగ భద్రతపై ఆందోళన – పునరావాసం డిమాండ్
రేషన్ వాహనాల ద్వారా ఉపాధి పొందుతున్న పలువురు డ్రైవర్లు తమ కుటుంబాలు పూర్తిగా ఈ ఆదాయపైనే ఆధారపడుతున్నాయని చెప్పారు. రద్దుతో తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయామని, రుణాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజా హైకోర్టు నోటీసులతో ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు