ఏపీలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరుకులు అందించే బాధ్యతను మళ్లీ చౌక ధరల దుకాణాల డీలర్లకే ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం కోరింది. అంతేకాకుండా, డీలర్ల ఆదాయం పెంచేందుకు రేషన్ షాపుల్లోనే విలేజ్ మాల్స్(Village Malls) ఏర్పాటు చేయాలనే జీవో 5ను అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం రేషన్ డీలర్లకు అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు.గత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకంగా ఎండీయూ వ్యవస్థ(MDU system)ను తీసుకువచ్చిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 29,500 మంది రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఆత్మగౌరవంతో జీవిస్తూ కుటుంబాలను పోషించుకునేవారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఇచ్చేవారని ఆయన అన్నారు. దీనివల్ల ఐదేళ్లలో రూ. 80 కోట్ల మేర రేషన్ డీలర్లు లబ్ధి పొందారని ఆయన వివరించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే రేషన్ పంపిణీ అంశంపై ఇవాళ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇకపై రేషన్ పంపిణీని వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపులకు వెళ్లి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు.
కుదరడం
జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వాహనాలను ఆపేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా ప్రజలు బియ్యం తీసుకునేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రేషన్ వాహనాల అంశంపై పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో రేషన్ సరకులు పంపిణీ చేస్తున్న మొబైల్ రేషన్ డెలివరీ (ఎండీయూ) వాహనాలు కొనసాగించాలా నిలిపివేయాలా అన్న అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ పంపిణీ చేసేందుకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి సరుకులు తీసుకోవడం కుదరడం లేదని, మరోసారి వాహనం రాకపోవడంతో సరుకులు కోల్పోతున్నట్లు కొందరు మహిళలు మంత్రితో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం రేషన్ వాహనాలను రద్దు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇవాళ క్లారిటీ వస్తుందంటున్నారు.
Read Also : Andhra Pradesh: 3 రోజుల పాటు పాపికొండలు యాత్ర రద్దు ఎందుకంటే