ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ యువతకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నిరుద్యోగంగా ఉన్న ఎస్సీ విద్యావంతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసిన యువతకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణను అందించి, విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.
ఉచిత శిక్షణతో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి విడతలో 150 మందికి జర్మన్ భాష (German language) శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత వీరికి జర్మనీలో నర్సింగ్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధంగా నైపుణ్య అభివృద్ధి, భాష పరిజ్ఞానం కలగజేసి ఎస్సీ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎస్సీ యువతకు భవిష్యత్ భరోసా
ఎస్సీ యువత ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి డోలా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. విద్యావంతులైన ఎస్సీ యువతకు నిరుద్యోగం అనే మాట లేకుండా చూడడం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
Read Also : Chandrababu : గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ