Onion cover ganja : అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ను పోలీసులు సమయానికి గుర్తించి అడ్డుకోవడంతో జిల్లాలో కలకలం రేగింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో తాలూకా ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ బృందం మదనపల్లె–తిరుపతి ప్రధాన రహదారిలోని యర్రగానిమిట్ట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టింది.
ఈ క్రమంలో నంబర్ లేని లగేజీ ఆటోను తనిఖీ చేయగా, పైన ఉల్లిపాయల బస్తాలు కనిపించాయి. అనుమానం వచ్చి లోతుగా తనిఖీ చేయగా, ఉల్లిపాయల కింద దాచిన తొమ్మిది బస్తాల్లో సుమారు 179 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.44.65 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
Read Also: Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ
ఈ కేసులో మదనపల్లె చంద్రకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఆవుల నాగరాజు, ఆవుల సుగుణలను అదుపులోకి తీసుకుని, వారి పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “యువతను మత్తుకు బానిసలుగా మార్చే ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తప్పవు. ప్రజలు పోలీసులకు సమాచారం అందించి జిల్లాను డ్రగ్స్రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలి” అని పిలుపునిచ్చారు. భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: