Rajampet Fire Accident: కడప జిల్లా రాజంపేటలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో లాడ్జిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే మంటలు లాడ్జిలోని సుమారు 22 గదులకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు ఊపిరాడక విలవిలలాడారు.పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి, లాడ్జిలో ఉన్న మిగతా 30 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మృతుడు ప్రొద్దుటూరు కొర్రపాడుకు చెందినవారిగా గుర్తించారు.
ఒకరు సజీవదహనం.. 33 మంది సురక్షితం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా, శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు.ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.