హైదరాబాద్: ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల (Film Awards) కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్ఎసీ) చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil raju) సూచించారు. అట్టహాసంగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం విజయవంతమైన నేపథ్యంలో, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
త్వరలో ఆంధ్రలో ఫిలిం అవార్డులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ప్రకటించనుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుతున్నాయంటే, వాటిని ఎంతో గౌరవంగా స్వీకరించాలని సూచించారు. ఎక్కడ ఉన్నా, షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా సరే, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వాళ్లందరిపైనా ఉందన్నారు. ‘ఇకపై ప్రభుత్వం తరఫున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు, దయచేసి మీ డైరీలలో ఆ తేదీని నోట్ చేసుకోండి. మీకు వచ్చిన అవార్డును తప్పకుండా స్వీకరించండి. ఇది చిత్ర పరిశ్రమకు నా వ్యక్తిగత విజప్తి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని దిల్ రాజు అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని, ఇందుకు ఆనందంగా ఉందని దిల్ రాజు అన్నారు.
2014 నుంచి 2023 వరకు ఫిలిం అవార్డులు ఎంపిక
మొదట 2024 చిత్రాలకే పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో ఆ దిశగా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన వివరించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గంట సమయం కేటాయించినప్పటికీ, కార్యక్రమ ప్రణాళిక నాలుగున్నర గంటలు ఉండటంతో, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి, కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండాలని కోరినట్లు దిల్ రాజు తెలిపారు. ఈ పురస్కారాల వేడుకకు మార్గనిర్దేశం చేసిన డి.సిఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read also: Women Driver: ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత