ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా DSC పరీక్షలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆన్లైన్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 12 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి.
కఠిన నిబంధనలు
పరీక్ష కేంద్రాల వద్ద గడిచిన అనుభవాల నేపథ్యంలో ఈసారి అధికారులు గట్టి నిబంధనలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా “ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వదు” అని DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి వేళకు చేరుకోవడం, హాల్ టికెట్ సహా అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సకాలంలో సిద్ధం చేసుకోవడం అభ్యర్థుల బాధ్యత. ఇది ఒక మెరుగైన నిర్వహణ కోసం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యగా భావించవచ్చు.
హాల్ టికెట్ లో వివరాలు తప్పనిసరి
హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో ముద్రించబడకపోతే, అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్లో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులుంటే, ఆ తప్పులను ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డుల ఆధారంగా సరిచూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకుని పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్న నేపథ్యంలో, అనేకమందికి ఇది కీలక అవకాశంగా మారింది.
Read Also ; Stampede : దేశ క్రీడా చరిత్రలో అతిపెద్ద విషాదం ఇదే