విజయవాడ : సువిశాలమైన కోస్తా తీరం ఎపిలో పరిశ్రమల పెట్టుబడులకు అత్యంత అనువైందని సిఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) స్పష్టం చేసారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీల సిఇఒ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ.. రాష్ట్రంలో సుదీర్ఘతీరప్రాంతం ఎపికి అతిపెద్ద వనరు అని ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్రంలో మారిటైం ఆపరేషన్స్, మోలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి (Development) చేసే ప్రణాళికల్లో భాగంగా.. తాము పోర్టుల నిర్మాణం, పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎం చెప్పారు. ఇన్ లాండ్ వాటర్ వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. దీంతోపాటు టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని.. ఈ ప్రణాళికల్లో భాగంగా క్రూయిజ్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
తీర ప్రాంతం… పెట్టుబడులకు గమ్యస్థానం
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడాన్ని తాము ఓ అవకాశంగా మలుచుకునేందుకు అన్ని కోణాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మార్చుకునేలా ఆలోచనలు చేస్తున్నామని సిఎం చెప్పారు. ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో కొత్త పోర్టులతో అనేక అవకాశాలు వస్తాయనే అంశాన్ని సిఇఒల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని సిఎంవివరించారు.
ఎపి అన్ని విధాలుగా పెట్టుబడులకు అత్యంత ఆశాజనకమైన ప్రాంతమని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేసారు. విస్తారమైన రవాణా వ్యవస్థ ఉందని వివరించారు. ఏ పరిశ్రమకైన తమరాష్ట్రం అనుకూల మన్నారు. దేశంలో అత్యంత ఆధునీక వసతులతో సింగపూర్ తరహాలో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రయోగాత్మకంగా వచ్చే జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్ సందర్శించిన సిఎం చంద్రబాబు
సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించింది. జురాంగ్ ఐల్యాండ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మోలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. పెట్రో కెమికల్ ఐ ల్యాండ్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీలీ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి జురాంగ్ పెట్రో కెమికల్ కేంద్రాన్ని చూపించారు. పెట్రోకెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు ఇతర ఉత్పత్తులైన పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులకు వివరించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Ration Card Distribution : ఆగస్టు 25 నుంచి 31 దాకా రేషన్ కార్డుల పంపిణి