Botsa Anusha : బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

Read Time:  1 min
Botsa Anusha : బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు
FONT SIZE
GET APP

ఉత్తరాంధ్ర వైయస్ఆర్ సీపీ అనగానే గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన బొత్స అనేక పదవులు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రం నుండి ఢిల్లీ దాకా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందారు. 2004 నుండి రాష్ట్రస్థాయి నేతగా బిజీ అయిన బొత్స తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి బాధ్యతలను మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పజెప్పి క్రమంగా తాను రాష్ట్ర రాజకీయాల పై దృష్టి సారించారు. 2019లో పట్టణాభివృద్ధి శాఖ, విద్యాశాఖలకు మంత్రిగా జగన్ క్యాబినెట్ లో కీలక పదవులను చేపట్టిన బొత్స ప్రభుత్వ బాధ్యతల కారణంగా విజయవాడకు పరిమితమవ్వాల్సివచ్చింది. నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా తన మేనల్లుడు చిన్న శ్రీనుపై బొత్స సత్యనారాయణ అప్పగించారు.

బొత్స నీడలో ఎదిగిన చిన్న శ్రీను.. వైయస్ఆర్ సీపీలో చేరిన తరువాత సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారు. అధినేత జగన్, అప్పటి ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయి రెడ్డితో సన్నిహితంగా మెలిగి విజయనగరం జిల్లాలో సొంతంగా అనుచరగణాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. పలు సందర్భాల్లో బొత్స సహకారంతో రాజకీయంగా అడుగులు వేగవంతం చేశారు. బొత్స స్థానం ఎంత పెద్దదైనా.. విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను చెప్పనిదే ఏమీ జరగదు అనేంతగా ఎదిగారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన చిన్న శ్రీను ఆ పై జెడ్పీ ఛైర్మన్ అయ్యారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా చూసుకున్నారు.

2024 ఎన్నికల తరువాత ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేతగా రాష్ట్రస్థాయి రాజకీయాల్లో బొత్స మరింత బిజీ అవ్వడంతో చీపురుపల్లిలో పార్టీ కార్యక్రమాలను కూతురు బొత్స అనూష పర్యవేక్షిస్తున్నారు. మండలస్థాయి, గ్రామస్థాయి నేతలతో నేరుగా మాట్లాడుతూ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు . అనూష ఇకపై నియోజకవర్గ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంటుందని, సమస్యలు ఉంటే అనూష దృష్టికి తీసుకురావాలని బొత్స నేతలకు సూచించారట.

తండ్రి ఆదేశాలతో నియోజకవర్గంలో అనూష విస్తృత పర్యటనలు చేస్తున్నారు. తరచుగా గరివిడిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసి పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపునిస్తున్న వివిధ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ విజయవంతం చేస్తున్నారు.. అనూష నియోజకవర్గంలో కీలకంగా మారడంతో ఇన్నాళ్ళూ చిన్న శ్రీను వెంట నడిచిన పార్టీ శ్రేణులు అనూషకు దగ్గరవుతున్నారు. 2024 ఎన్నికల అనంతరం వైయస్ఆర్ సీపీ అధిష్టానం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను చిన్న శ్రీనుకు అప్పగించింది. దీంతో చిన్న శ్రీను ప్రస్తుతం భీమిలికి పరిమితమయ్యి అక్కడ పార్టీని నిర్మించుకునే పనిలో బిజీ అయ్యారు. దీంతో చీపురుపల్లిలో పార్టీ శ్రేణులన్నీ ఓకే తాటిమీదకొచ్చి బొత్స అనూషతో కలిసి నడుస్తున్నాయి.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.