ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన కార్యాచరణపై సమీక్షిస్తూ, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రదర్శనపై సూటిగా స్పందిస్తూ, కీలక సూచనలతోపాటు తేలికపాటి హెచ్చరికలు కూడా ఇచ్చారు.
జూన్ 12న 2000 మందితో భారీ సమీక్షా సభ
జూన్ 12వ తేదీన అమరావతిలో (Amaravati) 2000 మందితో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏడాదిలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం ప్రజలు తెలిసేలా చేయాలన్నారు. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.
“చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా” – స్వీట్ వార్నింగ్
సమావేశంలో ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలపై ఓ రకమైన “స్వీట్ వార్నింగ్” కూడా ఇచ్చారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన దగ్గర రిపోర్ట్ ఉందన్న ఆయన సంక్షేమమే అజెండా జనాల్లోకి వెళ్తే అద్భుత భవిష్యత్ ఉంటుందన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఓటేసిన ప్రజల సంక్షేమమే ముద్దు అంటూ ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్లో తప్పు చేయొద్దు కాదు కూడదని దారి తప్పితే కొరడా తప్పదన్న సంకేతాలిచ్చారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన హెచ్చరికలతో పాటు కీలక సూచనలు-సలహాలిచ్చారు.
ఆరు నెలలకు ఓసారి పనితీరు సమీక్ష
ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానన్నారు. రాజీలేకుండా ప్రజాసేవలో పాల్గొన్న వాళ్లకు మున్ముందు పార్టీ అద్భుత అవకాశాలు కల్పిస్తుందన్నారు. మనం చేసే ప్రతిపనిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు చంద్రబాబు.
వినయంతో పనిచేయాలి
మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచిగా పనిచేస్తున్నారన్నారు చంద్రబాబు. ఒకరిద్దరు వల్ల అక్కడక్కడా కొత్త నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ఫేస్ టూ ఫేస్ మీటింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ పనితీరును ఎప్పటికిప్పుడు సమీక్షించుకోవాలన్న సీఎం మంచిచెడులు తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలని నేతలకు సూచించారు.
యోగా డే ఘనంగా నిర్వహించాలి
అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా డేను విజయవంతం చేయాలన్నారు చంద్రబాబు. మొత్తంగా సలహాలు, సూచనలే కాదు హెచ్చరికలతోనూ సాగింది సీఎం టెలికాన్ఫరెన్స్. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు.
Read also: Chandrababu Naidu: జేఈఈ టాపర్స్ను అభినందించిన సీఎం చంద్రబాబు