తెలుగుదేశం పార్టీ (TDP) మాత్రమే మహానాడు (Mahanadu) వంటి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై చర్చించే పార్టీగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ, గతంలో తిరుపతిలో జరిగే మహానాడు, ఈసారి దేవుడి గడప అయిన కడపలో జరగడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 34 మహానాడ్లు నిర్వహించగా, రెండు డిజిటల్ రూపంలో జరిగాయన్నారు. రాయలసీమ ప్రజల తీర్పును గౌరవిస్తూ కడపలో మహానాడును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయే కూటమిలో 93 శాతం స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిందని తెలిపారు.
త్యాగాలు – విజయానికి పునాది
రాయలసీమలో పదికి పది స్థానాల కోసం మరింత కృషి చేయాలని పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథం నుంచి తన వస్తున్నా పాదయాత్ర వరకు, తాజాగా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర వరకు, టీడీపీ కార్యకర్తలు త్యాగాలతో నిలబడిన చరిత్రను గుర్తు చేశారు. టీడీపీని అణచివేయాలన్న కుట్రలకు పని చేయకుండానే, అక్రమ అరెస్టులు, కేసులకు భయపడకుండా జెండా మోసిన కార్యకర్తలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. “మన చంద్రయ్య పీక కోసినా జై తెలుగుదేశం అన్నాడు” అని ఉదహరిస్తూ, అలాంటి చైతన్యం ప్రతి కార్యకర్తలో ఉండాలని చెప్పారు.
అభివృద్ధి అంటే టీడీపీ – చరిత్రలో శాశ్వత ముద్ర
తెలుగుజాతి అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, మహిళలకు ఆస్తిలో హక్కు, బాలికల విద్య ప్రోత్సాహం, మిగులు విద్యుత్, రూ.2 బియ్యం, పక్కా ఇళ్లు, రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అనేక రంగాల్లో టీడీపీ చేసిన కృషిని గుర్తు చేశారు. “తెలుగుదేశం పార్టీ ముందు – తర్వాత అన్న చరిత్ర రాష్ట్రానికి ఉందని గర్వంగా చెప్పగలుగుతాం” అని పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకు సాగే ఈ పార్టీ ప్రజల ఆశలకి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.
Read Also : Mahanadu : తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు – లోకేష్