ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన ఏడాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) భారీ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జూలై 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కూటమి భాగస్వామ్య నాయకులు “ఇంటింటి ప్రచారం” నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతుండగా, కార్యక్రమానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యే నేతలు
ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరుకానున్నారు. దాదాపు నెల రోజుల పాటు కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇంటింటి ప్రచారానికి చంద్రబాబు – లోకేశ్ మార్గదర్శకత
ఇంటింటి ప్రచారంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రైతు సంక్షేమం, విద్యారంగ పునరుద్ధరణ, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించనున్నారు. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే దానిపై పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీడీపీ కమిటీలు, కొత్త కార్యవర్గం ఇతర అంశాలపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
ప్రచారం క్రమంగా – మండల స్థాయిలో సమన్వయం
జూలై 2 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి ప్రచారం దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో పార్టీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు, యువజన నేతలు, మహిళా విభాగాలు క్రమపద్ధతిలో ఇంటింటి తిరుగుతూ ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు.
Read also: Andhra pradesh: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం