ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మొత్తం 11,256 ఆర్టీసీ బస్సులకు గాను, కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయడంపై ఆయన ప్రశ్నించారు. ఇది మహిళలను మోసం చేయడమేనని జగన్ పేర్కొన్నారు.
పథకాల రద్దు, ఆర్థిక కేటాయింపులపై జగన్ విమర్శలు
జగన్ (Jagan) తన పోస్టులో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర పథకాలపైనా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మఒడి’ పథకాన్ని తొలి ఏడాది వర్తింపజేయలేదని, 87 లక్షల మంది పిల్లల్లో దాదాపు 30 లక్షల మందికి ఈ పథకం అందడం లేదని ఆరోపించారు. మహిళలకు గతంలో తాము అమలు చేసిన అనేక పథకాలను చంద్రబాబు రద్దు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఉచిత సిలిండర్ల పథకానికి అవసరమైన రూ. 4,100 కోట్లకు గాను కేవలం రూ. 747 కోట్లు మాత్రమే కేటాయించడంపై జగన్ మండిపడ్డారు.
‘బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’
తన పోస్ట్ చివరలో జగన్ “బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ” అనే నినాదాన్ని ఉపయోగించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ఆయన హామీలు నమ్మదగినవి కావని ఈ నినాదం ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని జగన్ ప్రయత్నించారు. పథకాల అమలులో పారదర్శకత లేదని, మహిళలను, పేదలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.