రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప కుట్ర రాజకీయాలు చేయకండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కుప్పం ప్రజల దశాబ్దాల కల సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. రాయలసీమకు నీళ్లు వస్తుంటే వైసీపీ నేతలకు (YCP leaders) జీర్ణం కావడం లేదని ఎద్దేవా చేశారు.శనివారం కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువుకు చేరుకున్న కృష్ణా జలాలకు చంద్రబాబు సంప్రదాయ పంచెకట్టులో వేదమంత్రాల మధ్య జలహారతి ఇచ్చారు. అంతకుముందు ఆయన తన నివాసం నుంచి రైతులు, మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు.భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, నన్ను ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం ప్రజల రుణం తీర్చుకునే రోజు వచ్చింది. చివరి భూములకూ కృష్ణా నీరు చేరడంతో నా జీవితం ధన్యమైంది. 2028లో కృష్ణా పుష్కరాలు రాకముందే కుప్పానికి పండుగ వచ్చింది అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
వైసీపీ డ్రామాలు, ఎన్డీఏ పనితీరు
దివంగత ఎన్టీఆర్ కలలుగన్న రాయలసీమ సస్యశ్యామల స్వప్నాన్ని తాము నిజం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.“సీమలో పశువులకు కూడా నీరు లేకపోవడాన్ని నేను చూశాను. అందుకే 1999లోనే హంద్రీ-నీవా పనులు ప్రారంభించాను. మా ప్రభుత్వం 2014-19 మధ్య 12,441 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం 2 వేల కోట్లు వెచ్చించి చేతులు దులుపుకుంది. ఎన్నికల ముందు రంగులు వేసి, తాత్కాలికంగా నీరు వదిలి ప్రజలను మోసం చేశారు. వైసీపీ అబద్ధాలు చెబుతుంది, కానీ ఎన్డీఏ అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది అని తీవ్రంగా విమర్శించారు.నీటి విలువ అర్థం చేసుకునే పార్టీ తెలుగుదేశమే అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 3,850 కోట్లు మంజూరు చేసి, కాలువల విస్తరణ పూర్తి చేసినట్లు వివరించారు.నాలుగు నెలల్లో 40 టీఎంసీల నీటిని తీసుకొచ్చి పది రిజర్వాయర్లను నింపాం. దీని వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వచ్చే ఏడాదికల్లా చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు, చంద్రగిరి వంటి చివరి ప్రాంతాలకూ నీరు అందిస్తాం అని భరోసా ఇచ్చారు.
కరవు తరిమివేసే ప్రణాళిక
చంద్రబాబు మాట్లాడుతూ, “పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వంశధార-పెన్నా నదులను అనుసంధానిస్తాం. అలా చేస్తే రాయలసీమలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరవు అనే మాటే ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు కూడా అర్థం చేసుకోవాలి” అని స్పష్టం చేశారు.“‘రప్పా రప్పా’ రాజకీయాలు కుదరవు. పులివెందుల ప్రజలే దానికి సమాధానం చెప్పారు అని ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.ఆటో డ్రైవర్లకు ‘స్త్రీ శక్తి’ పథకం వల్ల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే, హిందాల్కో వంటి 12 పరిశ్రమలు కుప్పంలోకి వస్తున్నాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీని కుప్పానికి తీసుకువస్తాం” అని వాగ్దానం చేశారు.అదే విధంగా, మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం పథకం వంటి హామీలను నెరవేర్చుతూ ప్రజారంజక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.కృష్ణా జలాలను కుప్పం భూములకు అందించడం చంద్రబాబు జీవితంలో చారిత్రక ఘట్టం. ఆయన మాటల్లో భావోద్వేగం స్పష్టంగా కనబడింది. అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని, అడ్డంకులు పెట్టే కుట్ర రాజకీయాలను ప్రజలే తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.
Read Also :