Kuppam : పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు..

Read Time:  1 min
Kuppam : పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన దొంగలు..
FONT SIZE
GET APP

చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam, Chittoor district) మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హర్యానాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా తీవ్ర ఉద్రిక్తతను రేపింది. తమను పట్టుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు ఆత్మరక్షణలో కాల్పులకు దిగారు.కుప్పం మీదుగా దొంగల ముఠా సరిహద్దు దాటనున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో డీఎస్పీ పార్థసారథి (DSP Parthasarathy) ఆదేశాలపై సీఐ మల్లేశ్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. కృష్ణగిరి–పలమనేరు జాతీయ రహదారిపై తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద రాత్రి 10:30 ప్రాంతంలో వాహనాల తనిఖీలు మొదలయ్యాయి.ఈ సమయంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌ ఉన్న స్కార్పియో కారు ఆచూకీకి వచ్చింది. పోలీసులిద్దరు తనిఖీ కోసం ముందుకెళ్లుతుండగా, కారు వెనక్కి ఢీకొట్టే ప్రయత్నం చేసింది. కానిస్టేబుళ్లు అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాల్పులతో రెస్పాన్స్… కారు పరారీ

కారులో దొంగల ముఠానే ఉందని నిర్ధారించుకున్న సీఐ మల్లేశ్ యాదవ్ తన రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. డ్రైవర్ తొడకు తగిలేలా ఒక రౌండ్ ఫైర్ చేశారు. అయినా దుండగులు కారును వేగంగా నడిపి పరారయ్యారు.దీంతో పోలీసులు వెంటనే పలు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. కుప్పం మండలంలోని పలార్లపల్లె, బేవనపల్లె, గోనుగూరు, వెండుగంపల్లె వంటి ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పరమసముద్రం చెరువు దగ్గర దొంగలు స్కార్పియో వదిలి పారిపోయినట్లు గుర్తించారు.

డ్రైవర్‌కు గాయం? ముఠాలో ఐదుగురున్నారా?

డ్రైవర్ కాల్పుల్లో గాయపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఐదుగురు దుండగులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసు నమోదు, సరిహద్దు భద్రత కట్టుదిట్టం

ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ మాట్లాడుతూ దొంగలపై హత్యాయత్నం కింద కేసు నమోదైనట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also : Masula Beach Festival : నేటి నుంచే ‘మసులా బీచ్ ఫెస్ట్’

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.