అనంతపురం : రాయలసీమ అభివృద్దికి కేంద్రంలోని బిజెపి (BJP) ప్రభుత్వం కృషి చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై 2007లో చేసిన తీర్మాణాన్ని అమలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళమని పేర్కొన్నారు. జిల్లాలో హార్టికల్చర్ హబ్తోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా బిజెపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధిలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కిసాన్ రైలును అనంతపురం నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు.
అనంతపురంలో (Ananthapuram) మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ రావడం శుభ పరిణామం అని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమతోపాటు టమోటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలో రాయలసీమకు రాబోతోందని ఆయన పేర్కొన్నారు. పాడి పరిశ్రమలు కొంత మంది శాసిస్తుండటం వల్లే పాడి రైతులకు మంచి రేటు రావడం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకై రుణాలను అందించేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పెనుకొండ, కళ్యాణదుర్గంతోపాటు అనేక చారిత్రాత్మక కోటలు, దేవాలయాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి జిల్లా సాంస్కృతిక వైభవాన్నిప్రపంచానికి చాటి చెప్పే దిశగా కేంద్రంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆలోచన విధానాలను తెలుసుకుంటున్నామని వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పథకాలను తీసుకురానున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలో వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని, ప్రతి ఇంటి తలుపు తట్టి కేంద్రం అందించిన పథకాలను, అభివృద్ధిని వివరిస్తామని పేర్కొన్నారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Quartz Business : మంచి చేయాలనుకుంటే నిందలు మోపుతున్నారు–క్వార్ట్జ్ బిజినెస్ను వదిలేస్తున్నా:ఎంపీ వేమిరెడ్డి