ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా, రాష్ట్రంలో కొత్త బార్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, మహిళలకు ఒక శుభవార్తగా, ‘స్త్రీ శక్తి’ పేరుతో ఆగస్ట్ 15 నుండి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఆర్థిక, సామాజిక రంగాలపై క్యాబినెట్ నిర్ణయాలు
ఈ సమావేశంలో పలు ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అరకు, భవానీ ద్వీపంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఏపీబీడీసీఎల్ సంస్థకు రూ.900 కోట్ల రుణాలకు ప్రభుత్వం హామీగా ఉండేందుకు అంగీకరించారు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులకు గౌరవ వేతనం పెంచడంతో పాటు, 40 వేల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన 25 ఎకరాల భూమిని వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి కేటాయించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రాఖీ పౌర్ణమి కానుక, జిల్లాల పునర్విభజనపై చర్చ
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కానుకగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై ఆయన రాఖీ పౌర్ణమి రోజున అధికారికంగా ప్రకటన చేయనున్నారు. క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనలో ఉన్న లోపాలు, సరిహద్దు సమస్యలపై కూడా చర్చించారు. ఈ సమస్యలను సరిదిద్దడానికి నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జనగణన ప్రారంభమయ్యే లోపు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : DK & Komatireddy : డీకే శివకుమార్ కోమటిరెడ్డి భేటీ