AP Women Commission: వార్తా కథనం నెల్లూరు, ఫిబ్రవరి 25: పని చేసే ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో రూపొందించిన లైంగిక వేధింపుల (నిరోధము, నిషేదము మరియు పరిహారం) చట్టం-2013 పటిష్టంగా అమలు కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆకాంక్షించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఈ చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
Read Also: Punarvika : పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం
ఐసీసీ (ICC) కమిటీల ఏర్పాటు తప్పనిసరి
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పది మంది అంతకంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగినులు పనిచేసే ప్రతి చోటా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 256 కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని, అయితే ఇవి కేవలం రికార్డులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలకు అండగా నిలవాలని సూచించారు. కమిటీ సభ్యులకు చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే సమస్యలను సరిగ్గా పరిష్కరించగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
సామాజిక భయాలను వీడాలి
చట్టం వచ్చి 13 ఏళ్లు అవుతున్నా మహిళల్లో ఇంకా ‘సోషల్ స్టిగ్మా’ (సామాజిక భయం) పోలేదని, వేధింపులు ఎదురైనప్పుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షి-బాక్స్ (SHe-Box) పోర్టల్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
AP Women Commission: మహిళలకు గౌరవం ఇవ్వాలి
జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం శోచనీయమని, ప్రతి ఒక్కరూ వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని కోరారు. మహిళలకు స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుషా, మహిళా కమిషన్ సలహాదారు సూయజ్, డ్వామా పీడీ గంగా భవాని, జిల్లా అధికారులు మరియు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: