ఏపీ(AP) రాష్ట్రంలోని మత్స్యకారుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను మరింత బలోపేతం చేసింది. ఈ పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించనుంది. ముఖ్యంగా ప్రమాదవశాత్తూ లేదా సహజ కారణాలతో మత్స్యకారుడు మరణిస్తే, అతని కుటుంబానికి రూ.10 లక్షల బీమా సాయం అందించనుంది.
Read Also: Andhra Pradesh: పీపీపీ విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి
ఇప్పటివరకు మత్స్యకారులకు కేవలం రూ.2 లక్షల బీమా మాత్రమే ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచింది. ఇది మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. సముద్రంలో చేపల వేట ప్రమాదకరమైన వృత్తి కావడంతో, రోజూ ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేసే మత్స్యకారులకు ఈ పథకం అండగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
చేపల వేటపై పూర్తిగా ఆధారపడే మత్స్యకారుల కుటుంబాలు ప్రమాద ఘటనల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇకపై ప్రమాదాలు, సహజ మరణాల సందర్భంలోనూ మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం లభించనుంది. ఈ మొత్తాన్ని కార్మిక శాఖ ద్వారా లబ్ధిదారులకు అందిస్తారు.
అర్హతలు
- మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం ఉండాలి
- చెల్లుబాటు అయ్యే చేపల వేట లైసెన్స్ కలిగి ఉండాలి
- మత్స్యశాఖ వద్ద నమోదు చేసుకుని ఉండాలి
- చేపల బోట్లలో పనిచేసే కార్మికులు కూడా అర్హులే
- ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సహకార సంఘ ధృవీకరణ పత్రం అవసరం
బీమా సొమ్ము పొందే విధానం
పథకంలో(AP) నమోదు అయిన మత్స్యకారుడు మరణిస్తే, కుటుంబ సభ్యులు సమీప జిల్లా మత్స్యశాఖ కార్యాలయం లేదా రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన పత్రాలు:
- మృతుని ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- డెత్ సర్టిఫికేట్
- పంచనామా నివేదిక
పత్రాల పరిశీలన అనంతరం అధికారులు బీమా మొత్తాన్ని కుటుంబానికి జమ చేస్తారు. ఇదిలా ఉండగా, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే చేపల వేటకు అవసరమైన బోట్లు, వలలు, ఇంజిన్లు వంటి వాటిని రాయితీ ధరలకు అందిస్తోంది. మత్స్యకారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలుంటే మత్స్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: