ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటిలో వాహనమిత్ర పథకం (Vahanamitra Scheme) ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిని రక్షించడానికి, వారికి ఆర్థిక బలం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. డ్రైవింగ్ వృత్తి ఒకవైపు శ్రమతో కూడినదైతే, మరోవైపు వాహనాల సంరక్షణ, మరమ్మతులు, బీమా, పన్నులు వంటి ఖర్చులు భారం అవుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ పథకానికి ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ సొంతంగా కలిగిన వారు మాత్రమే అర్హులు. ఒక కుటుంబానికి ఒకే వాహనం ఉన్నా, బహువాహనాలు ఉన్నా ఒక్క యజమానికే సాయం లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట సమయంలో డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. దీని వల్ల లబ్ధిదారులు తమ వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులు (Fitness Certificate Fees), బీమా ప్రీమియాలు, మరమ్మతులు, వాహనం మెయింటెనెన్స్ వంటి ఖర్చులకు సౌలభ్యంగా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
మార్గదర్శకాలు, విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిధుల విడుదల షెడ్యూల్ ప్రకటించింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1న వాహనమిత్ర నిధులను విడుదల చేస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేస్తారు. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. దరఖాస్తుదారులకు కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏంటంటే..
లబ్ధిదారులకు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) ఉండాలి.ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి.వాహనం ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయి ఉండాలి.మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి.అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే.. ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు.కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
రేషన్ కార్డు కలిగి ఉండాలి
ఈ పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. లేదంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే ఈ పథకానికి అనర్హులు. కానీ, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.ఇంటి విద్యుత్తు వినియోగం (Power consumption) నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దీని కోసం దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
భూమి విషయానికి వస్తే.. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు భూమి ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.వాహనమిత్ర పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల అనగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని కన్నా ముందు సెప్టెంబర్ 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో కూడిన వివరాలను ప్రభుత్వం జీఎస్డబ్ల్యూఎస్కు అందిస్తుంది. 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు.
గ్రామ, వార్డు సచివాలయాల విభాగం
వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్డబ్ల్యూఎస్డీ) సెప్టెంబర్ 17 నాటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తుంది.
కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 వరకు అవకాశం ఉంటుంది.
ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు.
ఆ తర్వాత తుది జాబితా సెప్టెంబర్ 24కు సిద్ధమవుతుంది.లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జీఎస్డబ్ల్యూఎస్ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది.ఆ తర్వాత అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: