AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ధృవీకరణ పత్రాలు (Certificates) కలిగిన దివ్యాంగులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే చారిత్రాత్మక నిర్ణయానికి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది దివ్యాంగులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
Read Also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల
విశాఖలో రూ. 2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ
రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. విశాఖపట్నంలో రూ. 2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ పరిశ్రమ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను టెక్నాలజీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ఆమోదించారు.
అదేవిధంగా, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులతో పాటు సౌర, పవన, హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్ ధృవీకరించింది. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ఖరారుకు సంబంధించి కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అలాగే, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 28న పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆ రోజు అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని కూడా తీర్మానించారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు
సమావేశం సందర్భంగా రాజమండ్రిలో కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా కేసులు ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో ఆసక్తికర అంశంగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రసంగాలను కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిపై చర్చకు మంత్రులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కూడా సూచించారు. తాజా నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: