ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందిస్తూ, 2026-27 వార్షిక బడ్జెట్లో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో అత్యంత ప్రధానమైనది గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GPAIS) పునరుద్ధరణ. ఈ పథకం ద్వారా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ వరకు విధుల్లో ఉండగా ఏదైనా ప్రమాదం జరిగితే, వారి కుటుంబాలకు రూ. 20 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించడం ద్వారా వేలాది మంది పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.
Telangana: మంత్రులను అభినందించిన సీఎం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు డిజిటల్ అరెస్టుల ముప్పును ఎదుర్కోవడానికి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు 3,000 కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు, ఏఐ (Artificial Intelligence) ఆధారిత ప్రాజెక్టులు, స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్లు, డ్రోన్లు మరియు అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం నిధులు కేటాయించింది. అలాగే, రాజధాని ప్రాంతంలో అధునాతన పోలీస్ అకాడమీ నిర్మాణం కోసం 94 ఎకరాల భూమిని కేటాయించి, ప్రాథమిక పనుల కోసం రూ. 15 కోట్లను కేటాయించడం విశేషం.
సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నాలుగు కొత్త ఏపీఎస్పీ (APSP) బెటాలియన్ల ద్వారా 3,920 పోస్టులను మంజూరు చేసింది. అలాగే, కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుల్ ట్రైనీలకు ఇచ్చే స్టైఫండ్ను రూ. 4,500 నుండి ఏకంగా రూ. 12,000కు పెంచుతూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న టీఏ, డీఏ బకాయిలు మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ చెల్లింపుల కోసం రూ. 500 కోట్లను తక్షణమే విడుదల చేసింది. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ‘ఈగల్ టీమ్స్’, మహిళల భద్రత కోసం ‘శక్తి యాప్’ వంటి వినూత్న కార్యక్రమాలతో ఏపీ పోలీస్ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com