రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం
విజయవాడ : ఏపీలో అర్బన్(పట్టణ) ప్రాంతాల(AP) తరహా సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పది వేలకు పైగా జనాభా, రూ.కోటి కంటే ఎక్కువ వార్షికాదాయం కలిగిన పంచాయతీలను రూర్బన్లుగా మార్చాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే నెలలో దీనికి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇటీవల నిర్వహించిన సమీక్షలో రూర్బన్ పంచాయతీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా క్లస్టర్ విధానం రద్దు చేసి ఒక స్పెషల్తోపాటు మరో మూడు కేటగిరీలుగా పంచాయతీలను విభజించారు. దీని ప్రకారం స్పెషల్ పంచాయతీలే రూర్బం గా మారనున్నాయి. డిప్యూటీ ఎంపీడీవోలు పలువురిని రూర్బన్ పంచాయతీల్లో కార్యదర్శులుగా నియమించనున్నారు. నిబద్ధత, నిజాయతీ గల 359 మందిని ఎంపిక చేయనున్నారు. పంచాయతీలు అంటే అక్రమ వసూళ్లకు, అడ్డగోలు పనులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి వార్షిక ఆదాయం ఎక్కువ ఉన్న పంచా యతీల్లో ఇలాంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దాంతో డిప్యుటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న అదేవిధంగా పదోన్నతులను పొందిన వారిలో నుంచి రూర్బన్ పంచాయతీలకు కార్యదర్శులుగా ఎంపిక చేయనున్నారు.
Read also: ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్!

రెవెన్యూ విభాగం ద్వారా ఆస్తిపన్ను వసూళ్లు, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ
రూర్బన్ పంచాయతీలపై(AP) పర్యవేక్షణకు ప్రాంతీయ అధి కారులను నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మూడు, నాలుగు ఉమ్మడి జిల్లాలకు ఒక అధికారిని నియమించనున్నారు. జెడ్పీ సీఈవో క్యాడర్ స్థాయి అధికారులను ప్రాంతీయ పర్యవేక్షణా ధికారులుగా నియమించే అవకాశం ఉంది. విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురంలో ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కు ప్రాంతీయ అధికారులు జవాబుదారీగా సైతం ఉంటారు. ప్రజల సేవలకు రూర్బన్ పంచాయతీల్లో పురపాలికల తరహాలో కొత్తగా నాలుగు విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ప్రజారోగ్య విభాగం ద్వారా శానిటేషన్ పనులకుగాను దాదాపు 1025 మంది కార్మికుల సేవలను వినియోగించ నున్నారు. ఇందులో భాగంగా వీరితో ఇళ్ల నుంచి చెత్త సేకరణతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేయించనున్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ నుంచి సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ వరకు ప్రజారోగ్య విభాగానిదే బాధ్యతగా ఉంటుంది ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకంలో పనులను మెటీరియల్ నిధులతో అభివృద్ధి చేపట్టనున్నారు.
స్వర్ణపంచాయతీ పోర్టల్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
పాడైన రహదారులకు మరమ్మతులు, కొత్తవి నిర్మాణం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో పనులను నిర్వహిస్తారు. మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ బాధ్యత కూడా ఇంజినీరింగ్ విభాగా నికే ఉంటుంది. గ్రామీణ ప్రణాళికా విభాగం ద్వారా కొత్త నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాల నియంత్రణ వంటివి ప్లానింగ్ కార్యదర్శి ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రూర్బన్ పంచాయతీలకు ప్రత్యేకంగా బృహత్తర ప్రణాళికలు (మాస్టర్ ప్లాన్) రూపొందించనున్నారు. ప్రణాళికా బద్ధంగా పంచాయతీలను అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. రెవెన్యూ విభాగం ద్వారా ప్రజల నుంచి ఆస్తి పన్నుల వసూలు, అదే విధంగా కొత్త నిర్మాణాలకు విధిగా పన్నును విధించనున్నారు. పన్నేతర ఆదాయపు వసూళ్లు సక్రమంగా చేపట్టడం, దీంతో పాటు ఆదాయం పెరిగేలా చూడటం ఈ విభాగ ప్రధాన ఉద్దేశం. పన్నుల వసూళ్లలోనూ పారదర్శకత కోసం ఆన్లైన్ చెల్లింపులు చేయనున్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లను కూడా జారీ చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: